ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ తమ జట్టుకు సారథిని ప్రకటించింది. కెప్టెన్ గా అజింక్య రహానేను ఎంపిక చేసింది. అలాగే వైస్ కెప్టెన్ గా వెంకటేశ్ అయ్యర్ను నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీమ్ మేనేజ్ మెంట్ కీలక ప్రకటన చేసింది. "అజింక్య రహానే లాంటి సీనియర్ ప్లేయర్ అనుభవం జట్టును ముందుండి నడిపించడంలో సహయపడుతుంది. అతనికి, కేకేఆర్లో చాలా కాలంగా కొనసాగుతున్న వెంకటేశ్ అయ్యర్ వైస్ కెప్టెన్గా తోడ్పాటు అందిస్తాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మేము మరోసారి తప్పకుండా టైటిల్ గెలుస్తామని భావిస్తున్నాం" అని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ పేర్కొన్నారు. ఇక గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి అతడిని కోల్కతా అంటిపెట్టుకోలేదు. దాంతో వేలంలో శ్రేయస్ను పంజాబ్ కింగ్స్ దక్కించుకొని సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇక రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్ జాయింట్స్ జట్లకు సారథిగా వ్యవహరించాడు. ఆ అనుభవం కేకేఆర్కు ఉపయోగపడనుంది. అలాగే ప్రస్తుతం ముంబయి రంజీ జట్టుకు కూడా అతడే కెప్టెన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందుకే కోల్కతా ఫ్రాంచైజీ యాజమాన్యం రహానే అనుభవాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అర్థమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa