అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లతో ఇటీవలే.. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఈక్రమంలోనే వీరి మధ్య గొడవ జరగ్గా మధ్యలోనే వచ్చేశారు. దీనిపై యూఎస్ నాయకులు.. సాయం చేసిన దేశానికి కృతజ్ఞతలు చెప్పకుండా అవమానించి వెళ్లారంటూ మీడియా ఎదుటే చెప్పుకొచ్చారు. తాజాగా దీనిపై జెలెన్స్కీ స్పందించారు. ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేస్తూ.. అందులో అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ట్రంప్ మరోసారి అవకాశం ఇస్తే భేటీ అవుతానని వివరించారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా తనకు ఎలాంటి సమస్యా లేదన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య చాలా రోజులుగా యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ గొడవకు ముగింపు పలుకుతూ.. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే మూడ్రోజుల క్రితం దీని గురించి మాట్లాడేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఆమెరికాకు వెళ్లారు. ముఖ్యంగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లతో మాట్లాడారు. మీడియా ఎదుటే వీరు చర్చలు జరపగా.. మధ్యలో గొడవ జరిగింది.
ముఖ్యంగా జెలెన్స్కీ మాట్లాడుతూ.. తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలంటూ అమెరికా నాయకులపై ఒత్తిడి చేశారు. దీంతో ట్రంప్కు, జేడీ వాన్లకు విపరీతమైన కోపం రాగా.. సాయం అందించిన దేశానికి కృతజ్ఞతలు చెప్పకుండా అవమానిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇలా వీరి మధ్య వాగ్వాదం చెలరేగగా జెలెన్స్కీ మధ్యలోనే బయటకు వచ్చేశారు. చర్చలు పూర్తి కాకుండానే.. ఖనిజాల ఒప్పందంపై సంతంకం కూడా చేయకుండానే ఉక్రెయిన్ వెళ్లిపోయారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ.. జెలెన్స్కీ నిర్ణయం సరికాదన్నారు.
దీంతో వెనక్కి తగ్గిన జెలెన్స్కీ తాజాగా ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. అందులో ఐరోపా నుంచి మాకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైందని తెలిపారు. శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపై అంతా ఐక్యంగా ఉన్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యమని, యూకే, ఐరోపా సమాఖ్య, తుర్కియే వంటి దేశాలు దీనిపై కృతనిశ్చయంతో ఉన్నాయని వివరించారు. అలాగే ఇక్కడ అమెరికా ప్రాధాన్యతను కూడా అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు.
యూఎస్ నుంచి తమకు అందుతున్న సాయంపై తామెప్పపుడూ రుణపడి ఉంటామని జెలెన్స్కీ వెల్లడించారు. వారికి కృతజ్ఞతలు తెలపని రోజు కూడా లేదన్నారు. మా స్వాతంత్ర్యాన్ని కాపాడుతున్న వారికి ధన్యవాదాలు అంటూ మరోసారి వివరించారు. అంతేకాకుండా తమకు సుదీర్ఘ యుద్ధం వద్దని.. శాంతి కావాలని చెప్పారు. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని తాను భావిస్తున్నట్లు.. ఈక్రమంలోనే మరోసారి ట్రంప్తో భేటీ కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన అంగీకరిస్తే ఖనిజాల ఒప్పందంపై కూడా చర్చిస్తామన్నారు. వారి డీల్కు ఓకే చెప్పాలని కూడా అనుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa