ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే వాళ్లే డేంజర్

international |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 07:55 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిముర్ పుతిన్ కంటే అక్రమ వలదారుల వల్లే దేశానికి ఎక్కువ ముప్పు కల్గుతుందని వివరించారు. వారిని తిరిగి వారి దేశాలకు పంపించేయాలంటూనే.. ప్రజలంతా వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా తమ దేశానికి ఐరోపా లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఉక్రెయిన్ విషయంలో రష్యాతో తనకున్న సాన్నిహిత్యంపై వస్తున్న విమర్శలపై ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈక్రమంలోనే మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి అమెరికా ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. అలాగే మన దేశంలోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడే ముఠాలు, డ్రగ్ లార్డ్స్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారిపై ఎక్కువగా దృష్టి సారించాలని చెప్పారు. ఇలా చేస్తేనే అమెరికా పరిస్థితి ఐరోపాలా మారదని ట్రూత్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టులో వెల్లడించారు.


ఇదంతా ఇలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను తిరిగి ఇళ్లకు పంపించేస్తున్నారు. అనేక దేశాలకు చెందిన పౌరులను.. ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారి దేశాలకు తరలిస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసి మరీ పంపిస్తుండగా పలు దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఏమాత్రం పట్టించుకోని ట్రంప్.. అదే పద్ధతి అనుకరిస్తున్నారు. ఇప్పటికే అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల్ని కూడా యూఎస్ సైనిక విమానాల ద్వారా తిరిగి ఇక్కడకు పంపించేసింది. ఇప్పటికీ ఈ అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.


దీనిపై స్పందిస్తూ ట్రంప్.. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు పెద్ద ఎత్తునే తగ్గినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో కేవలం 8 వేల 326 మంది మాత్రమే పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. అదే గత ప్రభుత్వంలో మాత్రం ప్రతినెలా దేశంలోకి 3 లక్షలకు పైగా మంది అక్రమంగా ప్రవేశించే వారని ఆరోపించారు. అలాగే ఇప్పుడు 95 శాతం వలసలు తగ్గాయని.. తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశిస్తే కఠిన చర్యలతో పాటు పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa