ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ వదిలి గ్రౌండ్లోకి.. ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 05:52 PM

ఆంధ్రప్రదేశ్ బడ్జె్ట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నా.. మండలిలో మాత్రం అధికార, విపక్షాల మధ్య మాటల పోటీ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ మాటల పోటీని వదిలి ఆటలపోటీకి వేళైంది. అదేంటని అనుకుంటున్నారా.. శాసనసభ్యులకు క్రీడా, సాంస్కృతిక పోటీలను నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులకు సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు. పురుషులకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. అలాగే మహిళా శాసనసభ్యురాళ్లకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 18,19,20వ తేదీలలో మూడు రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన శాసనసభ్యులు చీఫ్ విప్‌లు, విప్‌లకు పేర్లు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.


అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే శాసనసభ్యులకు కొంత ఆటవిడుపు కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శాసనసభ్యులకు ఆటలపోటీలు నిర్వహించడం ద్వారా రోజూవారీ కార్యకలాపాల నుంచి కాస్త విశ్రాంతి దక్కుతుందని భావిస్తున్నారు. అయితే ఈ పోటీలలో వైసీపీ శాసనసభ్యులు కూడా పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలిరోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. గవర్నర్ ప్రసంగం రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ఆ తర్వాత తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.


అయితే సభలో లేకపోయినా కూడా ప్రజా సమస్యలపై బయట పోరాటం చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే మరింత సమయం కేటాయించాల్సి వస్తుందనే కారణంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైఎస్ జగన్ అప్పట్లో ఆరోపించారు. దీంతో అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే తాజాగా శాసనసభ్యులకు ఆటలపోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. వైసీపీ సభ్యులు ఇందులో పాల్గొంటారా.. లేదా దూరంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa