ఏపీలో ఇటీవల నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు చోట్ల కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. ఈ నేపథ్యంలో, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఇతర కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, ఐకమత్యంతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పడానికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనం అని చెప్పారు. "ఇవాళ ఎన్డీయే తరఫున విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలే చరిత్ర తిరగరాస్తున్నాం. 2024 ఎన్నికలే చూసుకుంటే 57 శాతం ఓట్లతో 93 శాతం స్ట్రయిక్ రేట్ సాధించాం అదొక చరిత్ర. 9 నెలల తర్వాత ఇవాళ చూస్తే. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మనం పోటీ చేస్తే రెండూ గెలిచాం ఇది కూడా ఒక చరిత్ర. ఇంతకుముందు మూడు గ్రాడ్యుయేట్ స్థానాలు గెలుచుకున్నాం.ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు ఇద్దరు అభ్యర్థులకు సహకరించాయి. మొదట ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు ప్రాతిపదికన మద్దతు పలికాం. గ్రాడ్యుయేట్ ఎన్నికలే నాకు చాలా సంతోషం కలిగించాయి. ఇద్దరు అభ్యర్థులు కూడా రెండో ప్రాధాన్యత ఓటు అవసరం లేకుండా గెలిచారు. నాకు తెలిసినంతవరకు ఇంత పెద్ద మెజారిటీలు ఇంతకుముందెప్పుడూ రాలేదు. అందరూ కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ కలిసి పనిచేయాలి. కూటమి గెలుపు ఏపీ పునర్ నిర్మాణానికి సంజీవనిగా పనిచేస్తుంది. అసాధ్యమనుకున్న విశాఖ స్టీల్ ప్లాంటు సుసాధ్యమైంది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేసుకున్నాం.రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి... రాష్ట్రంలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి.గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.1.9 లక్షల కోట్లతో ఎన్టీపీసీ, జెన్ కో ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.రాష్ట్ర పునర్ నిర్మాణం కోసమే మూడు పార్టీలు కలిశాయి.ఇందులో ఎలాంటి స్వప్రయోజనాలు లేవు" అంటూ చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa