అసభ్య పదజాలంతో దూషించి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే సినీ నటుడు పోసాని కృష్ణమురళి పనిగా పెట్టుకున్నారని పోలీసుల తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టులో గురువారం వాదనలు వినిపించారు. ఇలా చేయడం ఆయన అలవాటుగా మార్చుకున్నారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను పిటిషనర్ అసభ్యకర పదజాలంలో దూషించారన్నారు. సభ్య సమాజం అంగీకరించలేని పదజాలంతో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారన్నారు. రాష్ట్రంలో 5 పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషనర్ కోరారని, ఇందులో కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలైందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విశాఖ జిల్లా పద్మనాభం, అనంతపురం, సూళ్లూరుపేట పోలీసులు పీటీ వారెంట్లు వేసినప్పటికీ అవి అమల్లోకి రాలేదన్నారు. పిటిషనర్కు రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్.. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమలు చేసి పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నందున ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర నాలుగు కేసులలో పీటీ వారెంట్లు అమలు కానందున పిటిషనర్ విషయంలో బీఎన్ఎ్సఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa