గత జగన్ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి నారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతుందని తెలిపారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక్క విశాఖలోనే కాదు తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు చేశారని అన్నారు. ఏపీలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో మంత్రి నారాయణ మాట్లాడారు. తణుకులో రూ.63.24 కోట్ల విలువ ఉన్న చోట రూ.754 కోట్లకు బాండ్లు జారీ చేశారని చెప్పారు. రూరల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారన్నారు. తిరుపతిలో రూ.170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరగడంతో తాము వచ్చిన తర్వాత ఐదు నెలలు బాండ్లు జారీ నిలిపివేశామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 965 టీడీఆర్లు, విశాఖపట్నంలో 266 టీడీఆర్లు పెండింగ్లో ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. మూడు నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని తెలిపారు. 2007లో ఎంఐజీ ఇళ్లు అభివృద్ధి చేసేలా రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం,కర్నూలులో ప్రాజెక్ట్ పూర్తి అయింది... మిగిలిన చోట్ల పెండింగ్ ఉందని అన్నారు. మొత్తం 571.69 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందని చెప్పారు. ధరల విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు ఇచ్చిందని అన్నారు. అయితే పెండింగ్లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్ అమల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa