ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగన్న మరణంపై ఆయన కుమారుడు కాంతారావు సందేహాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 01:49 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని తన స్వగృహంలో వివేకా అనుమానాస్పద రీతిలో మరణించారు. బాత్రూంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. వివేకా మరణం చుట్టూ మిస్టరీ నెలకొంది. బాత్రూంలో జారిపడి మరణించారని, గుండెపోటుతో చనిపోయారని తొలుత ప్రచారం జరిగింది. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు ఉండడంతో వివేకాది హత్య అని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.తర్వాత దీనిని హత్య కేసుగా మార్చి దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఓవైపు కేసు దర్యాఫ్తు జరుగుతుండగా కీలక సాక్షులు, కేసుకు సంబంధం ఉన్న వ్యక్తులు అనుమానాస్పదరీతిలో చనిపోవడం మరో సంచలనంగా మారింది. వివేకానందరెడ్డి 2019 లో చనిపోగా అప్పటి నుంచి 2024 వరకు ఈ కేసుకు సంబంధించిన నలుగురు వ్యక్తులు వివిధ కారణాలతో చనిపోయారు. తాజాగా వివేకా నివాసంలో వాచ్ మన్ గా పనిచేసిన రంగన్న కూడా అనుమానాస్పదరీతిలో చనిపోయారు. రంగన్న మరణంపై ఆయన కుమారుడు కాంతారావు సందేహాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన కీలక సాక్షులు, కీలక వ్యక్తులు ఎవరెవరు ఎలా మరణించారంటే వివేకా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్, ఆయన అర్ధాంగి భారతిలను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్ లో మరణించారు. నారాయణ యాదవ్ మరణానికి అనారోగ్యమే కారణమని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి పులివెందులకు ప్రయాణిస్తుండగా జగన్, భారతి మాట్లాడుకున్న మాటలు, ఫోన్ సంభాషణలు డ్రైవర్ నారాయణ యాదవ్ విన్నారని, వివేకా హత్య కేసులో యాదవ్ ను విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. విచారణకు పిలిచేలోపే యాదవ్ మరణించడం పలు సందేహాలకు తావిస్తోంది. కాగా, యాదవ్ మరణంపై పోలీసులు కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.వివేకా హత్య కేసులో వాచ్ మన్ రంగన్న కీలకమైన సాక్షి.. హంతకులను ప్రత్యక్షంగా చూసిన రంగన్న సీబీఐకి, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్, ఉమాశంకరరెడ్డి ఈ హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత శివశంకరరెడ్డి, అవినాశ్ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, తదితరుల ప్రమేయం బయటపడింది. హత్య గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి బెదిరించాడని రంగన్న అప్పట్లో అధికారులకు చెప్పారు. ఇటీవల రంగన్న అనారోగ్యానికి గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆసుపత్రికి, ఆ తర్వాత కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రంగన్న మరణించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.2022లో వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు పులివెందులలోని జగన్‌ క్యాంపు ఆఫీసు, వివేకానందరెడ్డి, వైఎస్‌ అవినాశ్ రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్‌ కోఆర్డినేట్స్‌ తీసుకున్నారు. ఇది జరిగిన తర్వాత రోజుల వ్యవధిలోనే వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి చనిపోయారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసులకు లొంగిపోతే రూ.10 కోట్లు ఇస్తామని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు ఆఫర్ ఇచ్చారని, తాను తిరస్కరించానని 2021 అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత మాట మార్చి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని అనంతపురం ఎస్పీకి సీబీఐపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు.వివేకా హత్య కేసు అనుమానితులలో ఒకరైన కటికరెడ్డి శ్రీనివాసుల రెడ్డి 2019 సెప్టెంబర్ లో చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత ప్రచారం జరిగింది. వివేకా హత్య కుట్రకు సంబంధించి శ్రీనివాసుల రెడ్డికి, ఆయన బావ పరమేశ్వర రెడ్డికి ముందే తెలుసనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధికారులు పరమేశ్వర రెడ్డికి నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరై పరమేశ్వర రెడ్డి తిరిగి వచ్చిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాసుల రెడ్డి చనిపోయారు. పోస్ట్ మార్టంలో శ్రీనివాసుల రెడ్డి శరీరంలో కాలేయానికి, కిడ్నీకి మధ్య భాగంలో రక్తం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. శ్రీనివాసుల రెడ్డి కేసును అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ రక్తం ఆనవాళ్లకు సంబంధించి ఎలాంటి దర్యాఫ్తు జరపకుండానే కేసు మూసేశారు.వివేకా చనిపోయిన తర్వాత తొలుత మృతదేహాన్ని పరిశీలించిన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఈ కేసులో కీలక సాక్షిగా అధికారులు పేర్కొన్నారు. మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, శరీరంపై గాయాలను చూసి వివేకాది హత్యేనని భావించినట్లు సీబీఐ ముందు అభిషేక్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం అనారోగ్యం పాలైన అభిషేక్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో చనిపోయారు.వైఎస్ వివేకా హత్య కేసులో కుట్రకు సంబంధించి కీలక విషయాలు తెలిసిన వ్యక్తిగా భావిస్తున్న ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరులో మరణించారు. గంగిరెడ్డి వైఎస్ భారతి తండ్రి.. అనారోగ్యంతో గంగిరెడ్డి మరణించారని ప్రచారం జరిగింది. వివేకా హత్య తర్వాత మృతదేహానికి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది బ్యాండేజీలు చుట్టారని సమాచారం. నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ ప్రచారం నేపథ్యంలో ఈసీ గంగిరెడ్డి మరణంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa