ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌పై 9 రన్స్ తేడాతో విక్టరీ..ఫైనల్‌ బెర్తు దిశగా ముంబై మరో అడుగు

sports |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 11:49 PM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2025లో ముంబై ఇండియన్స్ జట్టు ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 రన్స్ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ జెయింట్స్ చివరి వరకూ పోరాడినా విజయం మాత్రం సాధించలేకపోయింది. చివరకు సరిగ్గా 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 9 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.


కాగా మహిళల ప్రీమియర్ లీగ్ 2025లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు ఇది వరకే ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకు పాయింట్ల పట్టికలో గుజరాత్ 2, ముంబై మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ లీగ్‌లో లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో ముంబై, గుజరాత్ జట్లు.. ఆ బెర్తుపై కన్నేశాయి.


ఇందులో భాగంగా ముంబై వేదికగా ఈ రెండు జట్లూ ఇవాళ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. మూడో స్థానం నుంచి రెండో ప్లేసుకు ఎగబాకింది. ఏడు మ్యాచ్‌లలో ఐదింట్లో గెలిచింది ముంబై. 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో మూడో ప్లేసులో గ్రూప్ దశను ముగించింది గుజరాత్.


ఇక ఈ లీగ్‌లో చివరి లీగ్ దశ మ్యాచ్‌లో మంగళవారం ముంబై, ఆర్సీబీ తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. అలా కాకుండా ఓడిపోతే మాత్రం.. ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ముంబై జట్టు ఎలిమినేటర్‌లో మళ్లీ గుజరాత్‌తోనే తలపడాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa