ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 03:09 PM

అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు  న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని.. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట అని అన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని.. వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని.. విధి నిర్వహణలో అంగన్‌వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ. 20 వేలు ఇవ్వాలన్నారు. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa