వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే కాకినాడ పోర్టు అక్రమాల కేసులో విచారణకు రావాలంటూ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారుల ఎదుట విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
కోటరీ వల్లే వైఎస్ జగన్కు తాను దూరమయ్యానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. చుట్టూ ఉన్న వాళ్ల మాటలు వినొద్దని జగన్కు చెప్పానని గుర్తు చేసుకున్నారు. మీ మనసులో నాకు స్థానం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని జగన్కు చెప్పినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. తన మనసు విరిగిపోయింది కావునే.. వైసీపీ నుంచి బయటకు వచ్చానన్న విజయసాయిరెడ్డి.. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని.. అలాగే తాను మళ్లీ వైసీపీలో చేరనని స్పష్టం చేశారు. రాజీనామా సమయంలో వైఎస్ జగన్ తనను పార్టీలో ఉండమన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని తమ నాయకుడు అన్నారనీ , కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ వైసీపీకి ఘర్ వాపసీ ఉండదని తేల్చి చెప్పారు. అలాగే కాకినాడ కేసులో వైఎస్ జగన్కు ఎలాంటి ప్రమేయం లేదని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
మరోవైపు తనకు, జగన్కు మధ్య విభేదాలు సృష్టించింది కోటరీలోని వాళ్లేనన్న విజయసాయిరెడ్డి, వారి వల్లనే తాను జగన్కు దూరమయ్యానని అన్నారు. కోటరీలోని వాళ్లే సూత్రధారులు, పాత్రధారులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకుడు అనే వాడు చెప్పుడు మాటలు వినకూడదన్న విజయసాయిరెడ్డి.. కోటరీ మాటలు వినకుంటేనే జగన్కు భవిష్యత్తు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాకినాడ పోర్టు అక్రమాల కేసులో విజయసాయిరెడ్డిని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. కాకినాడ పోర్టు అక్రమాల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ.. అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది. రెండు నెలల కింద విజయసాయిరెడ్డిని విచారించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa