ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ రైలు హైజాక్: బందీలుగా 182 మంది.. 16 మంది మిలిటెంట్ల హతం

international |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 07:58 PM

పాకిస్థాన్‌లో బలోచిస్థాన్ ప్రావిన్సులో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన మిలిటెంట్లు.. వందల మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 104 మందిని సైన్యం కాపాడినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారని, వీరందర్నీ సమీపంలోని మచ్ పట్టణానికి తరలించినట్టు పేర్కొన్నారు. అలాగే, 16 మంది మిలిటెంట్లను సైన్యం హతమార్చినట్టు వెల్లడించారు. బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), పాకిస్థాన్ సైన్యాల మధ్య రాత్రంతా కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో 30 దాకా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. దీనిని అధికారులు ఇప్పటి వరకూ ధ్రువీకరించలేదు.


బీఎల్ఏ మిలిటెంట్లు 182 మందిని బందీలుగా చేసుకోగా.. వీరిలో ఎక్కువమంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో రైలులో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులున్నారని అధికారులు తెలిపారు. పర్వత ప్రాంతం క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద ట్రాక్‌ను పేల్చి జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీస్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లోకోపైలట్ చనిపోగా.. పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.


కొంత మందిని పర్వత ప్రాంతాల్లోకి బందీలుగా తీసుకెళ్తోన్న మిలిటెంట్లను సైన్యం వెంబడిస్తోంది. మిలిటెంట్లు తప్పించుకోడానికి గ్రూపులుగా విడిపోయినట్టు నివేదికలు అందుతున్నాయి. అయితే, భద్రతా బలగాలు సొరంగాన్ని చుట్టుముట్టాయని, పర్వత ప్రాంతం కావడంతో ఆపరేషన్‌ క్లిష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, సైన్యం అపహరించిన వ్యక్తులను, జైల్లోని బలోచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లో విడుదల చేయాలని, లేకుంటే రైలును పూర్తిగా పేల్చేస్తామని మిలిటెంట్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, సైనిక ఆపరేషన్ ఆపకుంటే 10 మంది బందీలను చంపేస్తామని బెదిరించారు.


కాగా, మహిళలు, చిన్నారులను విడిచిపెట్టినట్లు బీఎల్‌ఏ ప్రకటించినప్పటికీ.. వారిని రక్షణ కవచాలుగా వాడుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.. ప్రయాణికుల రక్షణ కోసం మరో రైలును అక్కడకు పంపినట్టు వివరించాయి.


హైజాక్ ఘటన నేపథ్యంలో పెషావర్, క్వెట్టా రైల్వే స్టేషన్లలో బాధితుల బంధువుల కోసం అత్యవసర సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు.


ఇదిలా ఉండగా ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. అయితే, బలూచిస్థాన్‌లో హింసను ప్రేరేపించడం ద్వారా దేశంలో అస్థిరతను సృష్టించడానికి ‘శత్రు శక్తులు’ కుట్ర పన్నుతున్నాయని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa