బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ మిలిటెంట్లు జాఫర్ ఎక్స్ప్రెస్పై దాడి చేసిన ఘటనలో రైలు లోకో పైలెట్ డ్రైవర్ అంజాద్ హైజాక్ పరిస్థితులను వివరించారు. బీఎల్ఏ మిలిటెంట్లు తొలుత ట్రాక్ ను పేల్చివేశారని వెల్లడించారు. రైలు ఆగగానే బీఎల్ఏ ఉగ్రవాదులు దాడి ప్రారంభించారని ఆయన వివరించారు. మిలిటెంట్లు రైలు కిటికీలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారని, తాము చనిపోయామని వారు భావించారని వివరించారు. వారు అలా అనుకోవడమే తమ ప్రాణాలను కాపాడిందని అన్నారు.దాడి తర్వాత విడుదలైన ప్రయాణికుల్లో ఒకరు మాట్లాడుతూ, పేలుడు తర్వాత దుండగులు తమను బందీలుగా చేసుకున్నారని తెలిపారు. కమాండోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమను రక్షించారని, సైన్యం చూపిన తెగువ తమకు ధైర్యాన్నిచ్చిందని అన్నారు. మరోవైపు, పాకిస్తాన్ సైన్యం జాఫర్ ఎక్స్ప్రెస్ బందీ సంక్షోభానికి ముగింపు పలికినట్లు ప్రకటించింది. నైరుతి బలూచిస్తాన్లో జరిగిన ఈ ఘటనలో 33 మంది దుండగులను హతమార్చినట్లు, 340 మందికి పైగా ప్రయాణికులను విడిపించినట్లు సైన్యం తెలిపింది.అయితే, బీఎల్ఏ మాత్రం సైన్యం వాదనను ఖండించింది. ఇంకా బందీలు తమ వద్దే ఉన్నారని, భద్రతా దళాలతో పోరాడుతున్నామని తెలిపింది. పాకిస్తాన్ సైన్యం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, సైన్యం రక్షించినట్లు చెబుతున్న బందీలను తామే విడుదల చేశామని బీఎల్ఏ చెప్పుకొచ్చింది. అటు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బలూచిస్తాన్లో పర్యటించి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. దాడి బాధితులకు సంఘీభావం తెలిపారు. పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఖండిస్తూ ఇది పాకిస్తాన్కు ప్రమాదకరమని ఆయన అన్నారు. శాంతి లేనిదే దేశానికి అభివృద్ధి ఉండదని ఆయన పేర్కొన్నారు.మరణించిన వారి సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైన్యం ప్రకారం 21 మంది బందీలు, నలుగురు సైనికులు మరణించారు. అయితే, బలూచిస్తాన్లోని రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం 25 మృతదేహాలను సంఘటనా స్థలం నుండి మచ్ పట్టణానికి తరలించారు. మృతుల్లో 19 మంది సైనికులు, ఒక పోలీసు, ఒక రైల్వే అధికారి ఉన్నారని, మరో నలుగురిని గుర్తించాల్సి ఉందని ఆ అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa