ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రైన్ హైజాక్ ఘటనలో 214 పాక్ సైనికులను చంపేశాం.. బలూచ్ ఆర్మీ సంచలన ప్రకటన

international |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 07:09 PM

ఇటీవల బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ-బీఎల్ఏ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రత్యేక బలూచిస్తాన్ సాధన కోసం పోరాటం చేస్తున్న బీఎల్ఏ.. పాక్ ప్రభుత్వంపై ఎప్పటినుంచో పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో దాడులను ఉద్ధృతం చేస్తోంది. తాజాగా రైలు హైజాక్‌ ఘటనలో 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా ప్రకటించింది.


జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లు బీఎల్ఏ వెల్లడించింది. పాకిస్తాన్ అధీనంలో ఉన్న తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పాక్‌ ఆర్మీకి బీఎల్ఏ 48 గంటల గడువు విధించింది. ఈ గడువు శుక్రవారంతో ముగిసినా.. పాక్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బందీలుగా అదుపులోకి తీసుకున్న పాక్‌ సైనికులను చంపేసినట్లు ప్రకటించింది. దీంతో బలూచిస్తాన్, పాక్ ప్రభుత్వం మధ్య ఇప్పటివరకు ఉన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయినట్లు కనిపిస్తోంది.


ఈనెల 11వ తేదీన క్వెట్టా నుంచి పెషావ‌ర్ వెళ్తున్న జాఫ‌ర్ ఎక్స్‌ప్రెస్‌ను బ‌లోచిస్తాన్ రెబ‌ల్స్ హైజాక్ చేశారు. ఆ స‌మ‌యంలో ఆ రైలులో 400 మందికిపైగా ప్రయాణికులు, పాక్ సైనికులు ఉన్నారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కాల్పులు జరపగా.. అందులోని 21 మంది పౌరులు, న‌లుగురు సైనికులు మృతిచెందారు. అయితే జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌ ఘటన నేపథ్యంలో పాక్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది. హైజాక్‌ చేసిన తీవ్రవాదులందరినీ హతమార్చి బందీలను విడుదల చేసినట్టు పాకిస్థానీ సైన్యం బుధవారం ప్రకటించగా.. తాజాగా బీఎల్ఏ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. 30 గంటల ఆపరేషన్‌ చేపట్టి.. 33 మంది బీఎల్ఏ తీవ్రవాదులను కాల్చివేశామని.. ఆ ఘటనలో 21 మంది ప్రయాణికులు, నలుగురు పాక్ సైనికులు మరణించారని పాక్‌ ప్రకటించింది.


మరోవైపు.. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌ ఘటనలో తమ ఆపరేషన్‌ ముగిసిందని పాక్‌ సైన్యం చేసిన ప్రకటనను కూడా బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ఖండించింది. తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను పాకిస్తాన్ సైన్యం తప్పుదారి పట్టిస్తోందని బీఎల్‌ఏ ఆరోపించింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు స్వతంత్ర జర్నలిస్టులను పంపించాలని పాక్‌ ప్రభుత్వానికి బీఎల్‌ఏ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa