ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై ఓ భర్త అనుమానం.. పసిపాప బలైంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 06:12 PM

బాగా ఆకలేస్తోంది.. అమ్మ ఎందుకు పాలు పట్టించడం లేదో.. గుక్కపట్టి ఏడుస్తున్నా, అమ్మ పట్టించుకోవటం లేదెందుకో.. ఇంతలా అరుస్తున్నా, కళ్లు తిప్పి చూడదాయె. అమ్మా అని పిలుద్దామంటే మాటలు రావాయె. దేవుడా నా ఆకలి బాధ, అమ్మకు తెలిసేలా చూడు సామీ.. పెద్దయ్యాక నీకు కొబ్బరి కాయ కొడతాను. హమ్మయ్యా, ఇక పర్లేదు, అమ్మ వచ్చేస్తోంది.. నా దగ్గరకు వస్తోంది.. నాకు పాలు పట్టిస్తుంది, నాతో ఆడుకుంటుంది, నాకు మాటలు రాకున్నా తను కబుర్లు చెప్తుంది, గుండెలపై బజ్జో పెడుతుంది, జోలపాడుతుంది, చందమామ రావే అంటూ మారాం చేస్తుంది.. కన్నతల్లిని చూడగానే అ బుజ్జి తల్లి ఆనందమిది.. కానీ, ఆ ఆనందమే విషాదంగా మారుతుందని ఆ ఐదు నెలల చిన్నారికి తెలియదు పాపం..


అమ్మ దగ్గరగా వచ్చిందనే ఆనందంలో ఆ చిన్నారి కేకలు వేసింది, కాళ్లూ, చేతులూ ఊపుతూ సంతోషపడింది. బిడ్డను దగ్గరకు తీసుకున్న ఆ కన్నతల్లి.. బిడ్డ ఆకలి తీర్చి నిద్రపుచ్చింది. ఆ తర్వాత ఎవరూ ఊహించలేని కఠిన నిర్ణయం తీసుకుంది. నిద్రపోతున్న చిన్నారిని దిండుతో అదిమి ప్రాణం తీసింది. విశాఖపట్నంలో ఈ అమానుష ఘటన జరిగింది. భర్త అనుమానంతో వేధిస్తున్నాడనే కోపంతో.. ఆ భార్య, తన ఐదు నెలల చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...


విశాఖపట్నం నగర పరిధిలోని పెదగదిలి కొండవాలు ప్రాంతంలో గొర్లె వెంకటరమణ, శిరీష అనే ఇద్దరు దంపతులు నివశిస్తున్నారు. వీరిద్దరికీ 2013లో పెళ్లైంది. ఐదు నెలల కిందట వారికి ఓ పాప పుట్టింది. అయితే గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు వెంకటరమణ. రోజూ వేధించడం మొదలుపెట్టాడు. పాప పుట్టిన తర్వాత శిరీషకు భర్త నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. భార్యపై ఎంతలా అనుమానం పెంచుకున్నాడంటే.. ఇంట్లో సీసీ కెమెరా పెట్టి ఆమె కదలికలను గమనించేవాడు వెంకటరమణ. దీంతో శిరీష తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త తనను అనుమానిస్తున్నాడనే కోపంతో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 13న మంచంపై నిద్రపోతున్న పాపను దిండుతో ఊపిరాడకుండా అదిమి చంపేసింది.


ఆ తర్వతా తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో తెన్నేటిపార్కు తీరానికి శిరీష వెళ్లింది. తన వెంటే పాప మృతదేహాన్ని కూడా తీసుకెళ్లింది. బీచ్ వద్ద సముద్రంలోకి దిగిన శిరీష.. ఆ తర్వాత బయటకు వచ్చి భర్త వెంకటరమణకు ఫోన్‌ చేసింది. పాపతో తాను సముద్రంలోకి దిగిన సమయంలో బలమైన కెరటాలు వచ్చాయని.. పాపను లోపలికి లాగేశాయని చెప్పింది. ఆ తర్వాత సముద్రంలో నుంచి ఒడ్డుకు వచ్చే సరికి చిన్నారి కళ్లు తెరవడలేదంటూ భర్తకు ఫోన్‌లో చెప్పింది. దీంతో వెంకటరమణ వెంటనే పాపను చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు.


అయితే భార్య తీరుపై అనుమానం వచ్చిన వెంకటరమణ.. ఆరిలోవ పోలీసుస్టేషన్‌లో పాప మృతిపై ఫిర్యాదు చేశాడు. దీంతో చిన్నారి మృతదేహానికి కేజీహెచ్‌ ఆస్పత్రిలో పోస్టుమార్గం నిర్వహించగా అసలు విషయం తెలిసింది. ఊపిరాడక పోవడం వల్లే చిన్నారి చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో శిరీషను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం ఒప్పుకుంది. భర్త అనుమానిస్తుండడంతో ఆవేశంలో.. పాపను దిండుతో అదిమి చంపినట్లు శిరీష అంగీకరించింది. దీంతో శిరీషపై హత్య కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు..కోర్టులో హాజరు పరచారు. కోర్డు రిమాండ్ విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa