టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ రిషభ్ పంతేనని, అతడిని ఇంగ్లాండ్లో జరగనున్న వన్డే వరల్డ్కప్ జట్టులో ఎంపిక చేయాలని గత కొంతకాలంగా అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ అయితే, అటు వికెట్ కీపర్తో పాటు ఇటు బ్యాట్స్మెన్గా రాణిస్తాడని వారి వాదన.దీనికి తోడు భారత బ్యాటింగ్ లైనప్లో శిఖర్ ధావన్తో పాటు మరో ఎడమచేతివాటం బ్యాట్స్మెన్ అనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు... సీనియర్ వికెట్ కీపర్ అయిన దినేశ్ కార్తీక్ను పక్కనబెట్టి మరీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్కు ఎంపిక చేశారు. మొదటి మూడు వన్డేల్లో ధోని ఉండటంతో పంత్ రిజర్వ్ బెంచికే పరిమితమయ్యాడు.
అయితే, చివరి రెండు వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మొహాలీ వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో రిషబ్ పంత్కు జట్టు మేనేజ్మెంట్ తుది జట్టులో చోటు కల్పించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్లో పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 36 పరుగులతో ఫరవాలేదనిపించాడు.అయితే, వికెట్ కీపింగ్లో మాత్రం నిరాశపరిచాడు. ఒక సునాయస క్యాచ్తో పాటు.. రెండు కీలక స్టంపౌట్లను చేజార్చి భారత విజయవకాశాలను దెబ్బతీశాడు. ఇందులో ఓ స్టంపౌట్ను ధోని స్టైల్లో చేయబోయి విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ కీపింగ్ పట్ల.. మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఓటమికి స్టంపౌట్, క్యాచ్లు చేజార్చుకోవడమేనని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ప్రదర్శనపై అభిమానులు సోషల్ మీడియా సైతం మండిపడుతున్నారు. భారత ఓటమికి పంతే కారణమని కామెంట్లు పెడుతున్నారు. "అంపైర్.. ఇప్పుడు పంత్ను మార్చవచ్చా" అని కోహ్లీ అడుగుతున్నట్లు ఉన్న మీమ్ ట్విట్టర్లో వైరల్ అయింది."ప్రతి ఒక్కడు ధోని కాలేడు.. ధోని స్థానాన్ని భర్తీ చేసేవారే లేరు. అందుకే పంత్ను ప్రపంచకప్కు ఎంపిక చేయవద్దన్నది" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. రిషబ్ పంత్ కన్నా కీపింగ్లో దినేశ్ కార్తీక్ నయమని, అతని అనుభవం వరల్డ్కప్లో భారత జట్టుకు ఉపయోగ పడుతుందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa