క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. ఈ రోజు నుంచి సిక్సర్ల వర్షం, బౌండరీల మోత మోగనుంది. దేశం మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్తో ఊగిపోనుంది. స్టేడియాలకు క్రికెట్ ప్రేమికులు పోటెత్తనున్నారు. ప్రతి ఇంటా, ప్రతీ ఆఫీసులో ఐపీఎల్ చర్చ షురూ కానుంది. అయితే ఈ సెలబ్రేషన్స్ను ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లేందుకు బీసీసీఐ ఆలోచన చేసింది. సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు క్రికెట్ ప్రేక్షకుల అరుపులు, కేకలు, సందడి స్టేడియాల్లోనే కాదు ఇప్పుడు స్టేడియం బయట కూడా వినిపించనుంది. ఇందుకోసం బీసీసీఐ దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తోంది.
23 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 50 నగరాల్లో బీసీసీఐ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో పది వీకెండ్స్లలో (వారాంతాలు) ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. మార్చి 22 నుంచి మే 25 వరకూ పది వారాంతాల్ల ఈ ఫ్యా్న్ పార్కులు అభిమానులను ఉర్రూతలూగించనున్నాయి. ఐపీఎల్ ఫ్యాన్ పార్కుల ద్వారా స్టేడియంలోని అనుభూతిని, వాతావరణాన్ని.. బయట కూడా క్రికెట్ లవర్స్కు పంచనున్నారు. ప్రతి ఫ్యాన్ పార్కులో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ కోర్టులు, కిడ్స్ ప్లే జోన్ ఏర్పాటు చేయనున్నారు. వర్చువల్ జోన్ల ద్వారా కూడా అభిమానులు బ్యాటింగ్, బౌలింగ్ వంటివి ఎంజాయ్ చేయొచ్చు. ఫోటో బూత్స్, డగౌట్లు, ఫేస్ పెయింటింగ్ స్టేషన్లతో అచ్చం మైదానంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్నే ఫ్యాన్ పార్కులలో కూడా సృష్టించనున్నారు.
ఇక ఈ సీజన్కు సంబంధించి తొలి వారంలో రోహ్టక్, బికనీర్, గ్యాంగ్టక్, కొచ్చి, కోయంబత్తూరులలో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడతో పాటు కాకినాడ వాసులు కూడా ఈ ఫ్యాన్ పార్కుల ద్వారా ఐపీఎల్ మజాను ఎంజాయ్ చేయొచ్చు. గతంలో విజయవాడలో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయగా.. ఈ సారి దానికి అదనంగా కాకినాడలోనూ ఫ్యాన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ఎనిమిదో వారమైన మే 10, 11 తేదీలలో విజయవాడలో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పదో వారమైన మే 23, 25వ తేదీలలో కాకినాడలో ఫ్యాన్ పార్కు ఏర్పాటు కానుంది.
ఇక ఈ సీజన్లో మే పదో తేదీన సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ పోటీ పడనున్నాయి. మే 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అలాగే ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఇక మే 23వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్, మే 25న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa