ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లందర్ని తిరుపతికి తరలించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 06:07 PM

తిరుమలలో పోలీసులు, విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు.. అనధికారికంగా కొండపై ఉంటున్నవారిని గుర్తించారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు తిరుమలలో అనధికారిక వ్యక్తులు, అసాంఘిక శక్తుల అరాచకాలపై చర్యలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో తిరుమలలో అనధికార హాకర్లు, కూలీలు, అసాంఘిక శక్తులను గుర్తించి తరలించారు. రెండు రోజులుగా 71 మందిని తిరుమల నుంచి తిరుపతికి తరలించారు. కొండపై పాచికాల్వ గంగమ్మ ఆలయం దగ్గర కూలీలు తాత్కాలికంగా షెడ్లు వేసుకోగా.. టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు తొలగించారు. ప్రతి ఒక్కరి గుర్తింపును తనిఖీ చేశారు.. కూలీల్లో ఎవరైనా పాతనేరస్థులు ఉన్నారా అనే అంశాన్ని టాపిలాన్‌ ద్వారా పరిశీలించారు. వారిలో అనధికారికంగా ఉంటున్నా వారి ఇళ్లను ఖాళీ చేసి వాహనాల్లో తిరుపతికి తీసుకొచ్చారు.


పోలీసలు, టీటీడీ విజిలెన్స్, ఎక్సైజ్‌శాఖ పటిష్ట నిఘా పెడితేనే.. తిరుమలకు మత్తుపదార్థాలు, మద్యం అక్రమ రవాణా కాకుండా నియంత్రించొచ్చంటున్నారు. తిరుమలకు మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే ఈ మూడు విభాగాలు సమన్వయం చేసుకోవాల్సిందే. అందుకే నిఘాను కూడా పెంచారు. కొంతకాలంగా కొందరు కూలీల ముసుగులో మద్యం సీసాలను తిరుమలకు తీసుకొస్తున్నారు. వీరు తిరుమలలో వివిధ నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్‌ పనులు చేసేందుకు కూలీలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. వీరు నిర్మాణ పనులు పూర్తికాగానే వెనక్కు వెళ్లకుండా అక్కడే తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని ఉంటున్నట్లు గుర్తించారు. మద్యం బాటిల్స్ తిరుమలకు తీసుకురాకూడదనే నిబంధన ఉన్నా సరే.. తీసుకొచ్చి తాగి తరచూ గొడవలకు దిగుతున్నారు. తిరుమలలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారు.


ఇటీవల శ్రీవారి ఆలయ మాడవీధిలో, డీటైప్‌ క్వార్టర్స్‌ దగ్గర ఘటన కలకలం రేపాయి. అలాగే షాపింగ్‌ కాంప్లెక్స్‌ ముందు షెడ్‌లో ఇద్దరు మద్యం తాగిన ఘటన కూడా బయటపడింది. మాడవీధుల్లో ఒకరు మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ గొడవకు దిగిన సంగతి తెలిసిందే. మూడురోజుల క్రితం ఇద్దరు యువకులు మద్యం మత్తులో భక్తుల వాహనాలను అడ్డుకోవడంతోపాటు ముగ్గురిపైౖ దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. ఇలా వరుస ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. తిరుమలలో అనధికారికంగా ఉంటున్నవారిని తిరుపతికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa