దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆదివారం రాత్రి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పలు రైళ్ల ఆలస్యంతో 12, 13 నెంబరు ప్లాట్ఫాంలపై తీవ్రమైన రద్దీ నెలకుంది. దీంతో ఒకానొక సమయంలో పరిస్థితి అదుపుతప్పింది. తొక్కిసలాటకు దారితీసే అవకాశం ఉందని భావించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ఆ రెండు ప్లాట్ఫాంలపైకి ప్రయాణికులు వెళ్లకుండా నిలిపివేశారు. సాధారణ స్థితికి చేరుకోవడం అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, అప్పటికే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు వదంతులు వ్యాపించాయి. ఈ ప్రచారంపై స్పందించిన పోలీసులు.. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని, చిన్న గాయం కూడా కాలేదని తెలిపారు. ఆర్పీఎఫ్ కమాండెంట్, స్టేషన్ డైరెక్టర్ వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్టు వివరించారు.
మరోవైపు, రైల్వే మంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. భారీ రద్దీ నెలకున్నప్పటికీ ఎలాంటి తొక్కిసలాటగానీ, ప్రమాదకర పరిస్థితిగానీ తలెత్తలేదని పేర్కొంది. కాగా, గంగా, స్వతంత్ర సేనాని, జమ్మూ రాజధాని, లక్నో మెయిల్, మగధ్ ఎక్స్ప్రెస్ రైళ్లు.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు అలస్యంగా చేరుకున్నాయి. ఒకేసారి ఐదు రైళ్లు ఆలస్యం కావడం వల్ల అందులో వెళ్లాల్సిన ప్రయాణికులు 12, 13 నెంబరు ప్లాట్ఫాంలపైకి భారీగా చేరుకోవడంతో గందరగోళం నెలకుంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది చర్యలు చేపట్టారు. రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టి.. ఆ రెండు ప్లాట్ఫామ్లకు వెళ్లే మార్గాలను మూసివేశారు.
విపరీతమైన రద్దీతో భయాందోళనలకు గురైనట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా పోటెత్తడంతో తొక్కిసలాటకు దారితీసి 18 మంది మృతిచెందారు. పదులు సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా రైల్వే అధికారులు ముందే అప్రమత్తమయ్యారు. రద్దీని నియంత్రించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆలస్యమైన రైళ్లు స్టేషన్ నుంచి బయలుదేరడంతో రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. అయితే, ప్రయాణికులు బారికేడ్లపై నుంచి దూకి పరుగెత్తడం, క్యూలైన్లో ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. సోషల్ మీడియాలో దీనిపై వదంతులు వ్యాపించాయి.
![]() |
![]() |