భారత్కు చెందిన టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్ ఇంజినీర్ను డేటా చోర్యం ఆరోపణలతో ఖతార్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్లోని వడోదరకు చెందిన టెక్ మహీంద్ర సీనియర్ అమిత్ గుప్తాను జనవరి 1న అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఆ సంస్థ.. అమిత్ గుప్తాతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపింది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల బాగోగులు చూసుకోవడం తమ బాధ్యతని పేర్కొంది. ఈ కష్టకాలంలో అమిత్ కుటుంబానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చింది. అమిత్ను విడుదల చేయించడానికి ఇరుదేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. గతంలో ఇలాగే భారత నేవీ అధికారులను ఖతార్ బంధించింది.
కాగా, ఇప్పటికే ఈ అంశంపై ఖతార్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అమిత్ గుప్తాను విడిపించడానికి ఖతార్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. తప్పుడు ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కానీ, ఈ కేసుకు అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. అయితే, తమ కుమారుడ్ని ఖతార్ ప్రభుత్వ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారని అమిత్ తండ్రి అన్నారు. తప్పుడు ఆరోపణలతో తమ కుమారుడ్ని అరెస్ట్ చేశారని, తక్షణమే వదలిపెట్టాలని కోరారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అమిత్ తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు ఖతార్లోని టెక్ మహీంద్రా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నట్టు తెలిపారు. డేటా చోర్యం ఆరోపణలతో జనవరి 1న ఖతార్ పోలీసులు అరెస్ట్ చేశారని, 48 గంటల పాటు నీరు, ఆహారం ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దోహాలో మూడు నెలలుగా బంధించి ఉంచారని, తమ కుమారుడు నిర్దోషి అని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులో అమిత్ను ఇరికించారని ఆమె ఆరోపించారు. సంస్థలో ఎవరో చేసిన తప్పునకు ఖతార్- కువైట్ రీజియన్ హెడ్ స్థానంలో ఉన్న అమిత్ను అరెస్ట్ చేశారని వాపోయారు.
అరెస్ట్ గురించి తమకు సమాచారం ఇవ్వడానికి కూడా ప్రయత్నించలేదని చెప్పారు. కొద్ది రోజులుగా తమతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి అమిత్ స్నేహితుడికి ఫోన్ చేయడంతో ఈ విషయం తెలిసిందని వివరించారు. వెంటనే దోహాకు వెళ్లి ఎంబసీ అధికారులను కలిశానని.. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. అమిత్ గురించి వడోదర ఎంపీ హేమాంగ్ జోషిని కలిసి.. విడుదలకు సాయం చేయాలని కోరానని, ఉన్నతాధికారుల దృష్టికి దీనిని తీసకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారన్నారు.
బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషి మాట్లాడుతూ.. అమిత్ గుప్తా గత పదేళ్లుగా టెక్ మహీంద్రా ఖతార్ కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నాడని అన్నారు. అరెస్టైన విషయం తెలిసి.. దోహాకు వెళ్లిన తల్లిదండ్రులు, అక్కడ నెల రోజుల పాటు ఉండి అతడ్ని కలవడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని వివరించారు. విదేశాంగ అధికారులు దీనిపై స్పందిస్తూ అమిత్ గుప్తా అరెస్ట్పై ఖతార్ విదేశాంగ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అతడ్ని విడిపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కాగా, ఖతార్లో 2022 నుంచి భారతీయుడ్ని అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి. 2022లో 8 మంది నేవీ అధికారులను అరెస్ట్ చేయగా.. వారికి 2023లో మరణశిక్ష ఖరారు చేశారు. కానీ, ఖతార్ కోర్టు వారి శిక్షలను రద్దుచేయగా.. ఎమిర్ ఆదేశాలతో ఫిబ్రవరి 2024లో వీరిని విడుదల చేయడంతో భారత్కు చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa