ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎంపై కమేడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన పార్టీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 07:49 PM

మహారాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై స్టాండప్‌ కమెడియన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఓ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలతో షిండే అభిమానులు భగ్గుమన్నారు. దీంతో ఆయన షో జరుగుతోన్న హోటల్‌పై దాడికి పాల్పడ్డారు. ప్రముఖ స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా..ముంబయి ఖార్‌ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ కామెడీ క్లబ్‌లో షో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఉద్దేశిస్తూ జోకులు పేల్చారు. ‘‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది.. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది.. అంతా గందరగోళంగా ఉంది’’ మరాఠా రాజకీయాల గురించి మాట్లారు.


ఇదే సమయంలో షిండే ద్రోహిగా అభివర్ణించించిన కునాల్.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే బాలీవుడ్ సినిమా పాటలోని చరణాలను రాజకీయాలను అనుగుణంగా మార్చి వ్యంగ్యంగా పాడారు. దీనికి సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ ‘ఎక్స్‌ (ట్విట్టర్)’లో పోస్ట్‌ చేస్తూ ‘కునాల్‌ కా కమాల్‌’ అంటూ షిండేపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో కామెడీ షో కాస్త రాజకీయ వివాదానికి దారితీసింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై షిండే సేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్‌‌కు చేరుకుని ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా హోటల్‌లోకి వెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి.. రెచ్చిపోయారు.


పోలీసులు అక్కడకు చేరుకుని.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, కమెడియన్‌పై శివసేన కార్యకర్తల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఇది మరో రాజకీయ వివాదానికి దారితీసింది. హోటల్‌పై దాడిని ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఖండించారు. కమెడియన్‌ పాడిన పాటలో తప్పేముందని, ఇది 100 శాతం నిజమని అన్నారు. ఆయనపై దాడి మాత్రం కుట్రపూరితమైనది ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవా? అని ఆదిత్య ప్రశ్నించారు. జూన్ 2022లో శివసేనను చీల్చిన ఏక్‌నాథ్ షిండే.. తన వర్గంతో కలిసి బయటకు వచ్చి.. బీజేపీ సహకారంతో సీఎం పదవి చేపట్టిన విషయం తెలిసిందే.


కాగా, షిండే వర్గం ఎంపీ నరేష్ మష్కే స్పందిస్తూ.. ఉద్ధవ్ ఠాక్రే నుంచి డబ్బులు తీసుకున్న కునాల్ కమ్రా.., ఏక్‌నాథ్ షిండే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ‘‘కమ్రా ఒక కాంట్రాక్ట్ కమెడియన్. కానీ, అతను పాము తోకను తొక్కకూడదు... కోరలు బయటకు వచ్చిన తర్వాత భయంకరమైన పరిణామాలు ఉంటాయి.. మీరు దేశంలో స్వేచ్ఛగా తిరగకుండా చేస్తాం.. మేము దివంగత బాలాసాహెబ్ ఠాక్రే శివసైనికులం.. మిమ్మల్ని మేము టార్గెట్ చేస్తే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది’ అని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com