యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు, నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా యువతకు మాట ఇచ్చారు. ఇక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా అడుగుల వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెట్టబడులను ఆకర్షించేందుకు వివిధ రకాల చర్యలు చేపడుతోంది. అలాగే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోనూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది, ఆ ఒప్పందాల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే దానిపై ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశం సోమవారం ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై మంత్రులు చర్చించారు. అనంతరం కేబినెట్ సబ్ కమిటీ ఏం చర్చించిందనే దానిపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న నారా లోకేష్.. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఈ సమావేశంలోనే ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్ను సమర్థంగా తీర్చిదిద్దాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. భూకేటాయింపులు, అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ పోర్టల్లో పొందుపర్చాలని ఆదేశించారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారికి ఇబ్బంది కలిగించేలా ఉన్న విధానాలను సంస్కరిస్తామని లోకేష్ తెలిపారు. అలారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 20 వేల అంకుర పరిశ్రమల ఏర్పాటు, లక్ష మందికి ఉపాధి కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. స్టార్టప్లను ఏర్పాటు చేసేవారు, ఇప్పటికే ఏర్పాటు చేసినవారు కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa