యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో జరిగిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై జూన్ నుంచి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెన్షన్లు, అన్నక్యాంటీన్, స్టీల్ సిటీ, ఎన్టీపీసీ, బల్క్ డ్రగ్ పార్కు వంటి విజయగాధలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చేసిన పనులు చెప్పుకోకపోతే ప్రత్యర్థులు చెప్పే అబద్ధాలు జనంలోకి వెళతాయని, ఈ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... ఇటీవల నేను డిల్లీలో ఒక ఫంక్షన్ కు వెళ్లాను. అక్కడ మన సభ్యత్వం గురించే చర్చ జరుగుతోంది. మేం 5 లక్షలు కూడా చేయలేకపోతున్నాం, మీరు కోటి సభ్యత్వాలు ఎలా చేశారని అడిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాం నుంచి సభ్యత్వం మనకు ఒక ఎమోషన్. యలమంచిలి నియోజకవర్గంలో 41 వేల సభ్యత్వాలు నమోదు చేసినందుకు అభినందనలు. యువగళం పాదయాత్రలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని ఇక్కడ కార్యకర్తలు నాకు చెప్పారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, సోషల్ మీడియా, సభ్యత్వ నమోదులో మెరుగైన పనితీరు కనబర్చిన వారి వివరాలను ఆన్ లైన్ లో పెట్టా. ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ విధానం అమలుచేస్తున్నాం. టీడీపీలో కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం. ఈ విషయంలో క్లారిటీతో ఉన్నాం. కష్టపడి పార్టీకోసం పనిచేయండి. ప్రస్తుత మన ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుంది. తొలిసారి అవకాశం రాకపోయినా మూడు విడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం. అధైర్యపడవద్దు అని లోకేశ్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa