టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 10 నెలల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేశారో చెప్పాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఏం చేశారో చెప్పుకోలేకనే రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో సీబీబీ ప్లాంట్ శంకుస్థాపన సభకు హాజరైన మంత్రి లోకేష్, ఈ సందర్భంగా జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. గడిచిన 10 నెలలుగా ప్రకాశం జిల్లాకి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగుతోందని చెప్పడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనం. మార్కాపురంని జిల్లాగా ప్రకటించిన తర్వాతే జిల్లాలో అడుగుపెడతామన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతామన్నారు. దాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. వెలిగొండ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవరసరమైన నిధులు కూడా కేటాయించలేదు. ఇటీవలే జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును కూడా సందర్శించడానికి ధైర్యం చేయలేక వెళ్లిపోయారు. ఇద్దరు మంత్రులుండీ వెలిగొండ ప్రాజెక్టు లైనింగ్ పనులు చేపట్టలేదు. ప్రకాశం జిల్లాకు ఏమీ చేయలేకపోయారు. లోకేష్ మాటలు వింటుంటే ఆయనకు ప్రకాశం జిల్లాపై కనీస అవగాహన లేదని స్పష్టంగా అర్థమవుతుంది. జిల్లా పర్యటనకు వచ్చినప్పపుడు మంచి చేస్తామని చెప్పేమంత్రులను చూశాం కానీ, మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించే మంత్రిని లోకేష్నే చూస్తున్నాం. లోకేష్ రెడ్ బుక్ కి ఎవరూ భయపడేది లేదు. ఇటీవల స్థానిక సంస్థలకు నిర్వహించిన ఉప ఎన్నికలతో ఆ విషయం లోకేష్కి అర్థమయ్యే ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa