ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎఫ్ విత్‌డ్రాపై అదిరిపోయే శుభవార్త.. ఇక ఆ అవసరమే లేదు

business |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 10:30 PM

ఉద్యోగులకు భారీ ఊరట! ఈపీఎఫ్ఓ.. ఆన్‌లైన్ విత్‌డ్రాల కోసం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై ఆన్‌లైన్ క్లెయిమ్ సమయంలో.. క్యాన్సిల్డ్ చెక్కు అవసరం లేదు. ఇంకా బ్యాంక్ అకౌంట్‌కు యజమాని వెరిఫికేషన్ అవసరాన్ని కూడా తొలగించింది. దీనివల్ల దాదాపు 8 కోట్ల మందికి క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ చాలా వేగంగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఉద్యోగులకు, యజమానులకు కూడా ఈ ప్రాసెస్ సులువుగా మారుతుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. ఈ మార్పుల వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. "బ్యాంక్ అకౌంట్‌ను యూఏఎన్‌తో లింక్ చేసేటప్పుడే అన్ని వివరాలు వెరిఫై చేస్తారు. కాబట్టి అదనంగా డాక్యుమెంట్లు అవసరం లేదు." అని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.


ఇంతకుముందున్న పద్ధతిలో చాలా ఇబ్బందులు ఉండేవి. వాటిని తొలగించడానికి ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7.74 కోట్ల మంది ఈపీఎఫ్ కంట్రిబ్యూటర్లలో 4.83 కోట్ల మంది తమ బ్యాంక్ అకౌంట్లను యూఏఎన్ తో లింక్ చేశారు. ఇప్పటికీ రోజూ 36,000 బ్యాంక్ అకౌంట్ సీడింగ్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. బ్యాంకులు వెరిఫికేషన్ చేయడానికి సగటున మూడు రోజులు తీసుకుంటున్నాయి. యజమాని అప్రూవల్ కోసం 13 రోజులు పట్టేది. దీనివల్ల చాలా అప్రూవల్స్ పెండింగ్‌లో ఉండేవి. తాజా నిర్ణయంతో ఆ ఇబ్బంది తప్పనుంది.


ఆన్‌లైన్ విత్‌డ్రా క్లెయిమ్ చేసేటప్పుడు చెక్కు లేదా బ్యాంక్ పాస్‌బుక్ ఫోటోలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.


బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ కోసం యజమాని అప్రూవల్ అవసరం లేదు.


ఈపీఎఫ్ సభ్యులు తమ బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలంటే, కొత్త బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్ ఎంటర్ చేస్తే ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫై అవుతుంది.


ఈ మార్పుల వల్ల డాక్యుమెంట్లు సరిగా లేకపోవడం వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే సమస్యలు తగ్గుతాయి.


ఈ కొత్త రూల్స్ కోసం మార్పుల్ని మొదట 2024, మే 28న ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ చేశారు. కేవైసీ అప్‌డేట్ చేసిన కొంతమంది సభ్యులకు మాత్రమే ఇది వర్తించేది. అప్పుడు 1.7 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు ఈ బెనిఫిట్ కలిగింది. ఇది విజయవంతం కావడంతో.. ఈపీఎఫ్ఓ ఇప్పుడు కొత్త రూల్స్‌ను అందరికీ వర్తింపజేసింది. దీనివల్ల 14.95 లక్షల మంది ఈపీఎఫ్ సభ్యులకు వెంటనే బెనిఫిట్ కలుగుతుంది. ఎందుకంటే వారి బ్యాంక్ వెరిఫికేషన్ అప్రూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు వారు కూడా త్వరగా డబ్బులు తీసుకోవచ్చు.


పీఎఫ్ఓ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది ఉద్యోగుల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన సామాజిక భద్రతా పథకం. ఇక్కడ ఉద్యోగులు డబ్బులు దాచుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి మధ్యలో డబ్బులు తీసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా వస్తుంది. దీంట్లో ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా 12 శాతం పీఎఫ్ అకౌంట్లో జమవుతుంది. ఇంకా.. యజమాని కూడా 8 శాతానికిపైగా పెన్షన్ స్కీమ్‌లో జమ చేస్తే.. మరో 3 శాతానికిపైగా పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com