ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం.. .. స్పాట్‌లోనే చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 05:57 PM

ఏపీ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. యూపీఎస్‌ బ్యాటరీ రూమ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు.. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో జరిగిందనే దానిపై వివరాలు తెలుసుకున్నారు.


ఈ క్రమంలోనే సచివాలయం అధికారులపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. సెక్రటేరియట్‌లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని అధికారులను చంద్రబాబు నిలదీసినట్లు సమాచారం. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీని ద్వారా ఏదైనా ఘటన జరిగితే కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందనే దానిపై అధికారులను చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో భద్రతా ప్రమాణాలపై ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను చంద్రబాబు పరిశీలించారు.


ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు.. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. 24 గంటల్లో చెత్తనంతా శుభ్రం చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ప్రమాదం జరిగిన రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటుగా ఆర్థిక మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి, టూరిజం మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, హోం మంత్రి కార్యాలయాలు ఉన్నాయి. మరోవైపు సచివాలయంలో అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దీని వెనుక కుట్ర కోణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com