ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీకార సుంకాలపై... ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 10:52 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ 2వ తేదీ నుంచి వీటిని అమల్లోకి తీసుకురాగా.. అనేక దేశాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌పై పెద్ద ఎత్తున ప్రభావం పడింది. దీంతో ఈరోజును బ్లాక్ మండే అని కూడా నిపుణులు పిలుస్తుండగా.. ఈక్రమంలోనే ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా చైనా తప్ప మిగతా అన్ని దేశాలపై 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేయాలని భావిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన వైట్‌హౌస్ అసలు విషయం ఇదేనంటూ చెప్పింది. మరి ఆ పూర్తి వివరాలు మీకోసం.


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఏప్రిల్ 2వ తేదీన అనేక దేశాలపై ప్రతీకారం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీటిని అమలు చేస్తుండగా.. ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పడింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా భారత్, యూరోపియన్ యూనియన్, జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, చైనా, ఆస్ట్రేలియా, అమెరికా సైతం తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. మున్ముందు కూడా ఇవే కొనసాగి అంతర్జాతీయ మార్కెట్ విపరీతమైన నష్టాలను ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు తెలుసుకున్న ట్రంప్.. సుంకాలను నిలిపివేయాలని చూస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.


చైనా తప్ప మిగతా అన్ని దేశాలపై ట్రంప్ 90 రోజుల పాటు సుంకాలను నిలివేస్తారని అనేక మంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ చెప్పారంటూ గతంలో సీఎన్‌బీసీ, రాయిటర్ నివేదికలు రాగా.. ట్రంప్ పాజ్ బటన్ నొక్కే అవకశం ఉందని ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో అమెరికా స్టాక్‌లు బాగా పుంజుకున్నాయి. కానీ తాజాగా దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. ఇవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్ట చేసింది. తామేమీ సుంకాలను నిలిపివేయడం లేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరూ నమొద్దని కూడా సూచించింది.


మరోవైపు ఈ వార్తల మధ్యే డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మరో షాకింగ్ కామెంట్ చేశారు. సుంకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని చెప్పారు. అమెరికాను అనేక సంవత్సరాలుగా మోసం చేసిన దేశాల నుంచి.. తిరిగి బిలియన్ డాలర్లు పొందబోతున్నామని వివరించారు. ముఖ్యంగా చైనా సుంకాలను దుర్వినియోగం చేస్తున్న అతి పెద్ద దేశంగా ట్రంప్ అభివర్ణించారు. చైనా తమపై అధికంగా సుంకాలు విధించి మోసం చేసిందని.. గత పాలకుల వల్లే ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. ఇదే కొనసాగితే తాము చాలా నష్ట పోయేవాళ్లం అని.. కానీ మరోసారి అలా జరగనివ్వనంటూ వెల్లడించారు. అలాగే ఇప్పుడు 34 శాతం సుంకాలు విధించిందని.. ఫలితంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిందని చెప్పారు. అమెరికాను త్వరలోనే మరింత గొప్పగా మారుస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa