ముల్లాన్పూర్లో ధోనీ క్రీజులో ఉన్నంత సేపు స్టేడియం దద్దరిల్లిపోయింది. కాసేపే క్రీజులో ఉన్నా పాత రోజులను గుర్తు తెచ్చాడు. ఇంకాస్త ముందు వచ్చి ఉంటే మ్యాచ్ని కచ్చితంగా ఫినిష్ చేసుండేవాడేమో. క్రీజులో ఉన్నంత సేపు సీఎస్కేని గెలిపించేందుకే ధోనీ ప్రయత్నించాడు. ఆఖరి ఓవర్లో ధోనీ అవుటవడంతో సీఎస్కే 18 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.
ఎప్పుడూ ఆఖర్లో బ్యాటింగ్కి దిగే ఎంఎస్ ధోనీ పంజాబ్ కింగ్స్పై మాత్రం ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ధోనీ వచ్చే సమయానికి సీఎస్కే విజయానికి 31 బంతుల్లో 69 పరుగులు కావాల్సి ఉంది. 15.5 ఓవర్ వద్ద శివమ్ దుబే ఫెర్గ్యూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవడంతో ధోనీ బ్యాటింగ్కు వచ్చాడు. ఆరంభంలో సింగిల్స్ ఆడిన తలా ఆ తర్వాత బౌండరీలతో సీఎస్కేలో ఆశలు రేపాడు.
పంజాబ్ కింగ్స్పై 12 బంతులు ఆడిన ధోనీ ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. ధోనీ షాట్స్కి గ్రౌండ్లో ఉన్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. అంటే ఐదు సిక్సర్లు లేదా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్. స్ట్రయికింగ్లో ధోనీ ఉండటంతో పాత ఎంఎస్డీని గుర్తు చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే లాస్ట్ ఓవర్లో యశ్ ఠాకూర్ డౌన్ లెగ్గా వేసిన ఫుల్ టాస్ బంతిని ధోనీ షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడే ఉన్న యుజ్వేంద్ర చాహల్ క్యాచ్ని అందుకున్నాడు.
ధోనీ అవుటైన తర్వాత ఆ ఓవర్లో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే వచ్చాయి. జడేజా మూడో బంతికి సిక్సర్ బాదగా.. ఆఖరి రెండు బంతులలో కేవలం రెండు పరుగులే వచ్చాయి. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎందుకంటే గతంలో రాజస్థాన్పై తొలుత ఫీల్డింగ్ తీసుకుని ఇదే గ్రౌండ్లో ఓడిపోయింది. దాంతో శ్రేయాస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఐదుగురు సింగిల్ డిజిట్కే వికెట్ కోల్పోయినప్పటికీ ప్రియాన్షు ఆర్య సెంచరీ చేసి మ్యాచ్ని నిలబెట్టాడు. ఆఖర్లో శశాంక్ సింగ్ 52, మార్కో యాన్సన్ 34 పరుగులు చేయడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
భారీ టార్గెట్గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర, దేవాన్ కాన్వే శుభారంభమే అందించారు. 36 పరుగులు చేసిన రవీంద్ర 6.3వ ఓవర్ 61 పరుగుల వద్ద అవుటయ్యాడు. అయితే కెప్టెన్ రుతురాజ్ ఒక్క పరుగుకే అవుటవడంతో మ్యాచ్ మొత్తం మారిపోయింది. శివమ్ దుబే, దేవాన్ కాన్వే కలిసి మూడో వికెట్ను 89 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ డెత్ ఓవర్లలో పరుగులు చేయలేకపోవడంతో 18 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa