ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ భద్రతను నీరుకార్చేవిధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 12:35 PM

వైయస్ జగన్ భద్రతపై ప్రధాని, కేంద్ర హోంమంత్రులను కలుస్తామని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కుట్రపూరితంగా వైయస్ జగన్‌కు ఉన్న జెడ్‌ప్లస్ భద్రతను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంకు కూటమి ప్రభుత్వం పూర్తిగా తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. అయన మాట్లాడుతూ..... వైయస్ జగన్ గారికి జెడ్‌ప్లస్ భద్రత ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఆయన ఎక్కడకు వెళ్ళినా కనీస పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేయడం లేదు. రామగిరి మండలంలో అధికారబలంతో వైయస్ఆర్‌సీపీ బీసీ నేతను పొట్టనపెట్టుకున్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వైయస్ జగన్ ఆ ప్రాంతానికి వెడితే కూటమి ప్రభుత్వం కనీస భద్రతను కూడా ఏర్పాటు చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నాయకుడికి రాజకీయ దురుద్దేశంతో, ఒక కుతంత్రంతో ప్రభుత్వం భద్రత ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు. వైయస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాది మంది అభిమానులు వస్తారని తెలుసు. అయినా కూడా నిర్లక్ష్యంగా, దురుద్దేశంతో భద్రతా వైఫల్యానికి ప్రభుత్వం ఒడిగట్టింది. రామగిరిలో 1100 మంది పోలీసులని హెలిప్యాడ్ వద్దే భద్రత కోసం నియమించామని ప్రభుత్వం చెబుతోంది. టీవీల్లో ఆ సంఘటన సమయంలో వచ్చినదృశ్యాలను ప్రజలు చూశారు. అక్కడ కనీసం పదిమంది పోలీసులు ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వాలు చట్టబద్దంగా పనిచేయాలి. కానీ కూటమి ప్రభుత్వంలో అది మచ్చుకైనా కానరావడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అనంతపురంలో వైయస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలిపైనా, రాప్తాడ్ మాజీ ఎమ్మెల్యేపైన తప్పుడు కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలపై స్థానికంగా ఉన్న ప్రజలు కడుపుమంటతో ఉన్నారు. దీనిని ప్రశ్నించేందుకు వచ్చిన వైయస్ జగన్ గారిపై అభిమానంతో అక్కడికి రావడంతో ప్రభుత్వం కళ్ళు కుట్టినట్లు వ్యవహరించింది. హెలిప్యాడ్ చుట్టూ సరైన విధంగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బారికేట్స్ ఏర్పాటు చేయలేదని పోలీసులు తప్పించుకునేలా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు దీనిపై ఆయనకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa