ఆంధ్రప్రదేశ్లో చేబ్రోలు కిరణ్ వ్యవహారం హాట్ టాపిక్గా ఉన్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్తగా ఉన్న చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు చేబ్రోలు కిరణ్ను అరెస్ట్ చేశారు. టీడీపీ కూడా పార్టీ నుంచి చేబ్రోల్ కిరణ్ను సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా నేరాలకు అడ్డాగా మారుతోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే వారి చివరి రోజు అవుతుందంటూ చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. మహిళలను గౌరవంగా చూడాలని, వీలైతే మంచి విషయాలు నేర్పించాలని సూచించారు. వైఎస్ భారతిపై చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శమని చంద్రబాబు అన్నారు. సమానత్వం, మానవతా విలువలు ఆయన సొంతమని కొనియాడారు. అలాగే వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీ వెన్నెముకగా అభివర్ణించిన చంద్రబాబు.. జిల్లాల వారీగా బీసీల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్తో కలిసి అభివృద్ధిపై దృష్టి పెట్టామని తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 206 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయన్న చంద్రబాబు.. ఆగిరిపల్లిలో ఇల్లు లేని వారికి ఇళ్లు కట్టించే బాధ్యతను జిల్లా కలెక్టర్ తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్, మరుగుదొడ్లు, మంచి నీరు వంటి అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు.
అంతకుముందు ఆగిరిపల్లి మండలం వడ్లమానులో చంద్రబాబు పర్యటించారు. కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకు వెళ్లారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు, కోటయ్య పశువుల పాకను పరిశీలించారు. గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa