ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాంగ్ రేప్ చేశారంటూ నాటకమాడిన పనిమనిషి,,,దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి

national |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 10:02 PM

ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ మేయర్ ఉమేష్ గౌతమ్ ఇంట్లో పని చేసే 40 ఏళ్ల వయసు గల మహిళ.. మార్చి 29వ తేదీన పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఛాతీ నుంచి రక్తం కారుతుండగా అక్కడకు వెళ్లింది. అది చూసిన పోలీసులు తీవ్ర ఆందోళనకు గురవుతూనే మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే ఏమైందని ప్రశ్నించగా.. తనను మేయర్ ఉమేష్ గౌడ్, ఆయన కుమారుడు పార్థ్ కిడ్నాప్ చేశారని చెప్పింది. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది. ఈక్రమంలోనే తాను తప్పించుకోవడానికి ప్రయత్నించగా తుపాకీతో కాల్పులు జరిపారని పేర్కొంది.


దీంతో పోలీసులు సదరు మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూనే.. మరోవైపు మేయర్, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందో చెప్పాలంటూ వారిని ప్రశ్నించారు. కానీ తమకేమీ తెలియదని మేయర్, ఆయన కుమారుడు చెప్పారు. ఎన్నిసార్లు పోలీసులు అడిగినా వారి నుంచి ఇదే సమాధానం వచ్చింది. ఇదిలా ఉండగా.. మహిళకు చికిత్స చేసిన వైద్యులు పోలీసులకు ఫోన్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు. అలా వెళ్లగానే మహిళను తుపాకీతో కాల్చలేరని.. కావాలనే దాన్ని ఆమె ఛాతీలో పెట్టారని వివరించారు.


దీంతో షాక్ అయిన పోలీసులు మహిళ వద్దకు వెళ్లి తమదైన స్టైల్లో విచారించారు. దీంతో ఆ పని మనిషి అసలు విషయం చెప్పింది. తాను 2021వ సంవత్సరంలో మేయర్ ఇంట్లో పని చేసేదాన్నని.. కానీ సరిగ్గా చేయడం లేదంటూ ఆయన భార్య తనను ఉద్యోగంలోంచి తీసేసిందని వివరించింది. దీంతో వారిపై కోపం పెంచుకుని.. పగ తీర్చుకోవాలని ఇలా చేసినట్లు వెల్లడించింది. ముఖ్యంగా అత్యాచారం, హత్యాయత్నం చేశారంటే కచ్చితంగా వారికి శిక్ష పడుతుందని ఈ నాటకం ఆడినట్లు చెప్పింది.


2022లోనూ ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని.. అందుకే ఈసారి గట్టిగా ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. అందుకోసం తానే ఓ బుల్లెట్ తీసుకుని స్థానికంగా ఉండే వైద్యుడిని సంప్రదించినట్లు వివరించింది. అయితే అతడికి రూ.2500 ఇచ్చి ఆ బుల్లెట్‌ను తన ఛాతీ వద్ద ఇంప్లాంట్ చేయించుకున్నట్లు స్పష్టం చేసింది. ఆపై కిడ్నాప్ చేశారని, అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసుల వద్దకు వచ్చినట్లు పేర్కొంది. ఇదంతా విన్న పోలీసులు షాక్ అయ్యారు. మహిళతో పాటు ఆమెకు బుల్లెట్ ఇంప్లాంట్ చేసిన వైద్యుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa