ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14 ఏళ్ల కిందట మోదీ పెట్టిన పోస్ట్ వైరల్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 10:28 PM

ముంబయి 26/11 మారణహోమం కుట్రదారుడు.. మోస్ట్ వాంటెడ్ తహవూర్ హుస్సేన్ రాణాకు అమెరికాలో చట్టపరంగా అన్ని అవకాశాలూ మూసుకుపోయాయి. దీంతో అతడ్ని అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించారు.ఈ క్రమంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2011లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 26/11 ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 14 ఏళ్ల కిందట ఎక్స్ (ట్విట్టర్)లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాణాను అమెరికా అప్పగించడంతో అతడ్ని గురువారం సాయంత్రం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రధాని 2011లో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. రాణాను ‘నిర్దోషి’ అని ప్రకటించడం ద్వారా అమెరికా.. ‘భారతదేశ సార్వభౌమాధికారాన్ని అవమానించింది’ అని మండిపడ్డ ప్రధాని.. కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీయే 2 ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని విమర్శించారు.


మొత్తం 166 మందిని బలితీసుకున్న ముంబయి ఉగ్రదాడుల కుట్రలో రాణాకు ప్రత్యక్ష పాత్రలేదని 2011లో అమెరికా కోర్టు తేల్చి చెప్పింది. అయితే దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇచ్చినందుకు అతడిని దోషిగా నిర్ధారించింది.


‘‘ముంబయి దాడిలో తహవూర్ రాణాను అమెరికా నిర్దోషిగా ప్రకటించి భారతదేశ సార్వభౌమాధికారాన్ని అవమానించింది.. ఇది కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యం’ అని మోదీ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ను మళ్లీ షేర్ చేస్తోన్న నెటిజన్లు.. చట్టాన్ని ఎదుర్కోవడానికి రాణాను భారతదేశానికి విజయవంతంగా రప్పించినందుకు మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


‘చెప్పింది చేసే నాయకుడు. మా కెప్టెన్’ ఒకరు.. ‘మీరు దీన్ని సాధించారు సార్!! అభినందనలు..ధన్యవాదాలు!’ అని ఇంకొకరు.. ‘మోదీ ఉంటే, ఏదైనా సాధ్యమే’ అని మరొకరు ఇలా వరుసగా పోస్ట్‌లు పెడుతున్నారు.


ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రాణాను భారత్‌కు అప్పగిస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. అటు, చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోవడంతో రాణా భారత్‌కు రాకతప్పలేదు. గురువారం సాయంత్రం ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయినవెంటనే.. ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. అతడ్ని 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం 18 రోజుల పాటు అనుమతించింది.


పాక్‌లో పుట్టిపెరిగిన రాణా.. దాయాది సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. పాకి‌లోని ఉగ్రవాద సంస్థలు, వారి నాయకులతో అతడికి సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది.


ఈ విషయాన్ని అతడి చిన్ననాటి స్నేహితుడు, ఈ కేసులో ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ వెల్లడించాడు. ముంబయిలో వ్యాపార కార్యకలపాల ముసుగులో రెక్కి నిర్వహించి.. ఉగ్రవాదులకు సమాచారం చేరవేశాడని తెలిపాడు. ముంబయి దాడిలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పాత్రను కూడా అతను బయటపెట్టాడు. రాణా సహాయంతో తన గుర్తింపును దాచడానికి ఒక ఇమ్మిగ్రేషన్ కంపెనీని ప్రారంభించినట్టు వివరించారు. అంతేకాదు, రాణా తన భార్యతో కలిసి ముంబయి సందర్శించి.. విదేశీయులు విడిదిచేసే తాజ్ మహల్ హోటల్‌లో దిగాడు. అందుకే ఉగ్రదాడులకు అది కూడా టార్గెట్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa