అమెరికాలో భారత సంతతి మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షాపై మాఫియా ఆరోపణలు వచ్చాయి. గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నడిపిస్తున్నట్లు అతనిపై అభియోగాలు మోపారు. న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ఆరోపించారు. మాఫియా తరహా గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఆనంద్ షా... రాకెటీరింగ్, గ్యాంబ్లింగ్, మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నట్లు తేలింది. ఇక అభియోగాలు నమోదైన 39 మందిలో 42 ఏళ్ల ఆనంద్ షా కూడా ఒకరు అని అటార్నీ జనరల్ వెల్లడించారు. రాష్ట్రంలోని 12 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించిన తర్వాత ఈ అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మొత్తం నాలుగు పోకర్ క్లబ్లపై దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.అలాగే ఫ్లోరిడాకు చెందిన మరో భారత సంతతి వ్యక్తి సమిర్ ఎస్ నందకర్ణిపై కూడా అభియోగాలు నమోదు అయ్యాయి. పోకర్ హోస్ట్ అని అతనిపై కేసు నమోదు చేశారు. 39 మంది గ్యాంగ్ స్పోర్ట్స్బుక్ గ్యాంబ్లింగ్ పేరుతో స్పోర్ట్స్ టోర్నీలపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 3 మిలియన్ల డాలర్ల గ్యాంబ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. సినిమాలు, టీవీల్లో మాఫియాను రొమాంటిక్గా చూపిస్తారని, కానీ వాస్తవంలో అది చట్టాలను బ్రేక్ చేయడమే అవుతుందని, డబ్బు.. కంట్రోల్, హింసకు దారి తీస్తుందని అటార్నీ తెలిపారు.కాగా, న్యూజెర్సీలో ఆనంద్ షా ఓ కీలక రాజకీయనేతగా ఎదుగుతున్నారు. న్యూయార్క్ శివారు ప్రాంతం ప్రాస్పెక్ట్ పార్క్లో అతను మున్సిపల్ కౌన్సిలర్గా ఇటీవల రెండోసారి ఎన్నికయ్యారు. ఎకనామిక్ డెవలప్మెంట్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. కౌన్సిల్ సభ్యుడిని అరెస్టు చేయడం అంటే ప్రజల్లో ఎన్నికైన వ్యక్తులపై విశ్వాసాన్ని కోల్పోవడమే అవుతుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa