ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న రిషభ్ పంత్‌,,,ప్లేసు మార్చినా ఫెయిల్

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 10:49 PM

ఐపీఎల్‌లోనే అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న రిషభ్ పంత్‌.. మరోసారి విఫలమయ్యాడు. తాజా ఎడిషన్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలోనూ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 18 బంతుల్లో 21 రన్స్ మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయితే కెప్టెన్ వరుసగా విఫలమవుతున్నా.. లక్నో మాత్రం హ్యాట్రిక్ విజయాలు సాధించింది. గుజరాత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది.


ఐపీఎల్ 2025లో తొలి మూడు మ్యాచ్‌లో కేవలం రెండింట్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో వెనకబడ్డ లక్నో సూపర్ జెయింట్స్.. మళ్లీ గాడినపడింది. తాజాగా గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి.. ఈ ఎడిషన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. శనివారం లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. గుజరాత్ టైటాన్స్.. రెండో ప్లేసుకు పడిపోయింది.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓ దశలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 60 రన్స్‌), సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56 రన్స్‌) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్.. 120/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఈజీగా 200 పైచిలుకు రన్స్ చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. వీరిద్దరూ ఔట్ అయ్యాక.. మరే బ్యాటర్ కూడా నిలబడలేదు. దీంతో అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే గుజరాత్ పరిమితమైంది.


ఈ మ్యాచ్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ దూరమైన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న రిషభ్ పంత్.. ఈసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయినా రాణించలేకపోయాడు. బట్లర్‌ రెండు సార్లు క్యాచ్‌లు వదిలేయడంతో కాసేపు క్రీజులో ఉన్న పంత్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 18 బంతుల్లో 21 రన్స్ చేసి.. పెవిలియన్ చేరాడు. అయితే మార్‌క్రమ్ (31 బంతుల్లో 58 రన్స్‌), నికోలస్ పూరన్ (34 బంతుల్లో 61 రన్స్‌) చేయడంతో లక్నో లక్ష్యం దిశగా సాగింది. చివర్లో వికెట్లు పడ్డా.. చివరకు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. వరుస విజయాలు సాధించి ఊపు మీదున్న గుజరాత్‌కు షాక్ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com