వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ్ బెంగాల్లో మొదలైన నిరసనలు హింసకు దారితీశాయి. బెంగాల్ జిల్లాల్లో హింసాత్మక ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. బెంగాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. బహరంపూర్ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పోస్ట్లో ఆయన ఆహ్లాదకరమైన వాతావరణంలో టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలు ఆయన నియోజకవర్గం పరిధిలో లేకున్నా దానికి సమీపంలోని ప్రాంతాల్లోనే ఉండటం వల్ల ఈ పోస్ట్పై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెంగాల్లో హింసపై కలకత్తా హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది.
పఠాన్ రెండు రోజుల కిందట ఇన్స్టాగ్రామ్లో మూడు ఫోటోలు షేర్ చేస్తూ, ‘మంచి టీ తాగుతూ ప్రశాంతమైన పరిసరాలతో ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా’ అంటూ పోస్ట్ పెట్టారు. ముర్షిదాబాద్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆయనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
బీజేపీ ఆయనపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ.. ‘తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తోంది.. బెంగాల్ తగలబడిపోతోంది.. హైకోర్టు కళ్లుమూసుకుని ఉండలేమని చెప్పి కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది... మమతా బెనర్జీ పోలీసులను మౌనంగా ఉంచి హింసను ప్రోత్సాహిస్తున్నారు! ఇదే సమయంలో హిందువులు హత్యకు గురవుతుంటే తృణమూల్ పార్టీ ఎంపీ యూసఫ్ పఠాన్ రిలాక్స్గా టీ తాగుతూ ఆస్వాదిస్తున్నారు’ అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
వామపక్షాల మద్దతుదారులు కూడా యూసఫ్ పఠాన్ను విమర్శిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, ఇర్ఫాన్ పఠాన్ సోదరుడైన యూసఫ్ పఠాన్, ముర్షిదాబాద్ జిల్లా పరిధిలోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటైన బహరంపూర్ నుంచి గతేడాది ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. హింస చెలరేగిన ధులియా, సుతి, షంషేర్గంజ్, ప్రాంతాలు ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. షంషేర్గంజ్, ధులియా మాల్దా సౌత్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ ఇషా ఖాన్ చౌదరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్ ఎంపీ ఖలిలుర్ రెహమాన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న జాంగీర్పూర్లో సుతి ఉంది.
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బహరంపూర్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో, యూసఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఐదు సార్లు గెలిచిన అధీర్ రంజన్ చౌదరిని ఆయన ఓడించారు. అయితే, గుజరాత్లోని బరోడాకు చెందిన పఠాన్ను బెంగాల్లో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడంపై అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన ఆయన.. ముర్షిదాబాద్ హింసపై మౌనంగా ఉండటం ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa