ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెనకనుండి సర్కారును నడిపించేది సీఎం భర్తే..: అతిశీ

national |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 07:49 PM

దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి సహా ఆమె భర్తపై.. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రేఖా గుప్తా పేరుకే సీఎం అని ఆమె వెనక ఉండి సర్కారును నడిపిస్తున్నది ఆమె భర్త మనీష్ గుప్తా అని వెల్లడించారు. తానేమీ ఉత్తుత్తిగానే ఈ మాటలు చెప్పట్లేదని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదండోయ్ మనీష్ గుప్తా కొందరు అధికారులతో సమావేశం అయిన ఫొటోలను సైతం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.


ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్ గుప్త పలువు అధికారులతో సమావేశం అయ్యారని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గ్రామాల్లో సర్పంచిగా మహిళ ఎన్నిక అయితే ప్రభుత్వ విధులను ఆమె భర్తే చూసుకుంటారని.. గతంలో అనేక వార్తలు వచ్చేవని గుర్తు చేశారు. ఆమెకు ప్రభుత్వ పనులు ఎలా చేయాలో తెలియవు కాబట్టే ఆ పనులను ఆమె భర్త చూసుకుంటారని చెప్పేవారని వివరించారు. కానీ ఒక మహిళా ముఖ్యమంత్రి చేయాల్సిన పనులను ఆమె భర్త చేయడం దేశంలో ఇదే తొలిసారి కావొచ్చంటూ రాసుకొచ్చారు.


రేఖా గుప్తకు ప్రభుత్వ విధులు ఎలా నిర్వహించాలో తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇక్కడితో ఆగకుండా ఢిల్లీలో విద్యుత్ కోతలు, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు పెరిగిపోవడానికి కారణం ఆయా శాఖల్లో ముఖ్యమంత్రి ప్రమేయం లేకపోవడమేనా అని నిలదీశారు. ముఖ్యంగా రేఖా గుప్తా భర్త మనీష్ గుప్త.. ఎంసీడీ, డీజేబీ, పీడబ్ల్యూడీ, డీయూఎస్ఐబీ వంటి విభాగాల సీనియర్ అధికారులతో సమావేశం అయినట్లు, వాటికి ఆయనే అధ్యక్షత వహిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను షేర్ చేశారు. దాని కిందే ఈ ఫొటోలను జాగ్రత్తగా గమనిస్తే ఏయే అధికారులతో ఆయన సమావేశం అయ్యారో అందరికీ అర్థం అవుతుందని చెప్పారు.


అయితే అతిశీ చేసిన ఈ ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. ఒక మహిళ.. మరో మహిళా ముఖ్యమంత్రిపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. అలాగే రేఖా గుప్తా డీయూఎస్ యూ కార్యదర్శి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు పని చేశారని చెప్పారు. ఆమె భర్త ఆమెకు మద్దతు ఇవ్వడం చట్టవిరుద్ధం లేదా అనైతికం కాదన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కార్యాలయం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడాన్ని ప్రస్తావించారు. మనీష్ గుప్తా సమావేశాలకు హాజరవడం తప్పయితే.. సునీతా కేజ్రీవాల్ చేసింది కూడా తప్పే కదా అని ప్రశ్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa