ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్, ముంబయి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. పవర్ప్లే చివరి ఓవర్లో బుమ్రా బౌలింగ్లో కరుణ్ రెండు సిక్సులు, ఫోర్తో సహా 18 పరుగులు బాదాడు. ఇదే ఓవర్ చివరి బంతికి రెండు రన్స్ తీస్తూ బుమ్రాను ఢీకొన్నాడు. ఈ క్రమంలో ఇరువురూ వాగ్వాదానికి దిగారు. కరుణ్ క్షమాపణలు చెప్పినా బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరికి అంపైర్లు కలిగించుకుని గొడవను సద్దుమణిగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలో ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విభిన్నశైలిలో స్పందించడం వీడియోలో కనిపించింది. హిట్మ్యాన్ తాలూకు డిఫరెంట్ రియాక్షన్ వీడియోలో హైలైట్ అని చెప్పాలి. కాగా, ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన విషయం తెలిసిందే. ముంబయి నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 193 రన్స్కే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు డీసీ విజయం లాంఛనమే అనిపించింది. కానీ, అతడు పెవిలియన్ చేరడం, ఆఖర్లో ఢిల్లీ వరుస రనౌట్స్ ఆ జట్టుకు గెలుపును దూరం చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa