మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ మొఘల్ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ ట్యూసీ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్కు లేఖ రాశారు. అసత్య ప్రచారాల వల్ల సమాధిని కూల్చివేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరిగాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సమాధిని 'జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నం'గా ప్రకటించినట్లు ఆయన గుర్తు చేశారు. పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 కింద ఇది రక్షించబడిందని యాకుబ్ హబీబుద్దీన్ లేఖలో చెప్పారు."ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం, రక్షిత స్మారక చిహ్నం వద్ద లేదా సమీపంలో ఎటువంటి అనధికార నిర్మాణం, మార్పులు, విధ్వంసం లేదా తవ్వకం చేపట్టకూడదు. అలాంటి ఏదైనా కార్యకలాపాలు చట్టవిరుద్ధమైనవి, చట్ట ప్రకారం శిక్షార్హమైనవిగా పరిగణించబడతాయి" అని యూఎన్ సెక్రటరీ జనరల్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.ఇటీవల వచ్చిన ఛావా సినిమాలో ఔరంజేబును క్రూరాతి కృరుడిగా చూపించిన విషయం తెలిసిందే. దాంతో మూవీ చూసిన తర్వాత కొన్ని వర్గాలు ఆయన సమాధి వద్ద ఆందోళనకు దిగాయి. వెంటనే సమాధిని అక్కడి నుంచి తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. 1972లో ప్రపంచ సాంస్కృతిక మరియు సహజ వారసత్వ పరిరక్షణకు సంబంధించిన యునెస్కో సదస్సుపై భారతదేశం సంతకం చేయడాన్ని లేఖలో ప్రస్తావించారు. దాని ప్రకారం "ఇటువంటి స్మారక చిహ్నాలను నాశనం చేయడం, నిర్లక్ష్యం చేయడం లేదా చట్టవిరుద్ధంగా మార్చడం వంటి ఏదైనా చర్య అంతర్జాతీయ బాధ్యతలను ఉల్లంఘించడమే అవుతుంది" అని పేర్కొన్నారు.జాతీయ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చారిత్రక కట్టడాలను కాపాడేలా ప్రత్యేక భద్రతను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆదేశించాలని ఆయన యూఎన్ సెక్రటరీ జనరల్ కార్యాలయాన్ని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa