ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం మే 13వ తేదీతో ముగుస్తుండగా.. ఆ తర్వాత రోజే జస్టిస్ గవాయ్ సీజేఐగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇలా ఆయన భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఉండబోతున్నారు. అయితే 2025 వంబర్ 23వ తేదీ వరకే ఆయన పదవిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అప్పటికే ఆయన వయసు 65 సంవత్సరాలు దాటనుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలే కాగా ఏడు నెలలు మాత్రమే జస్టిస్ గవాయ్ పదవిలో ఉండబోతున్నారు.
జస్టిస్ గవాయ్ 1960వ సంవత్సరం నవంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985వ సంవత్సరంలో జస్టిస్ గవాయ్ తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987లో బాంబే హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ మరియు హైకోర్టు న్యాయమూర్తి దివంగత రాజా ఎస్ భోంస్లేతో కలిసి పని చేశారు. ఆ తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా రాజ్యాంగ పరిపాలనా చట్టంపై దృష్టి సారించారు. నాగ్పూర్ మరియు అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయం, SICOM, DCVL వంటి ప్రభుత్వ సంస్థలతో సహా అనే విద్యా సంస్థలకు ఆయన ప్రాతినిథ్యం వహించారు.
1992 ఆగస్టులో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2003 నవంబర్ 14వ తేదీన బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2005లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ముంబైలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, నాగ్పూర్, ఔరంగాబాద్ మరియు పనాజీ బెంచ్లలో పని చేశారు. 2019 మే 24వ తేదీన సుప్రీం కోర్టుకు పదోన్నతి పొందారు. ఈక్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఏకగ్రీవంగా సమర్థించిన న్యాయమూర్తుల్లో ఈయన కూడా ఒక భాగమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa