టీటీడీలో గోవుల మరణాలపై కూటమి నేతలు చర్చకు పిలిచి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారా, ఇదేనా బహిరంగ చర్చ నిర్వహించే తీరు అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోమాతల మరణాలపై నిజాలను అంగీకరించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని అన్నారు. కళ్ళ ముందే అన్ని ఆధారాలు కనిపిస్తున్నా చంద్రబాబు, లోకేష్లు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతల మరణాలపై బహిరంగంగా చర్చించేందుకు, వాస్తవాలను ఆధారాలతో సహా బయటపెట్టేందుకు వైయస్ఆర్సీపీ సిద్దంగా ఉందని, దీనికి కూటమి ప్రభుత్వం సిద్దమా అని సవాల్ చేశారు. అయన మాట్లాడుతూ..... హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పురాణాల్లో గోవులకు విశిష్ట స్థానం ఉంది. అలాంటి గోవులకు రాష్ట్రంలో రక్షణ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పవిత్రమైన తిరుపతి గోశాలలో నెలకు సగటున 15 గోవులు చనిపోతున్నాయనే ఆవేదనతో వైయస్సార్సీపీ నాయకులు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వాస్తవాలను బహిర్గతం చేశారు. అయితే ప్రభుత్వం కానీ, టీటీడీ కానీ పొరపాట్లను సరిదిద్దుకోకుండా తప్పును కప్పిపుచ్చుకునేందుకు, వాస్తవాలను మరుగున పరిచేందుకు రాజకీయ విమర్శలకు పాల్పడింది. తిరుమలకు సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి బాధ్యతతో వ్యవహరించాల్సిందిపోయి చంద్రబాబు సహా టీడీపీ నాయకులు రాజకీయ విమర్శలు చేయడం హిందూ సమాజాన్ని తీవ్రంగా అవమానించడమే అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa