ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు

national |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 08:02 AM

గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల మహిళ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఈ నెల 6వ తేదీన ఓ యువకుడు చికిత్స పొందుతున్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఐసీయూలో బెడ్‌పై చికిత్స పొందుతూ ఉండటం వల్ల ఆమె ఆ యువకుడిని ప్రతిఘటించలేకపోయింది.ఈ నెల 13వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత ఆమె తన భర్తకు ఈ విషయం చెప్పింది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి, ఆసుపత్రిలో జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. ఐసీయూలో ఉన్న సమయంలో తనపై లైంగికదాడి జరిగిందని, తన అనారోగ్యం కారణంగా ఆ యువకుడిని ఆ సమయంలో అడ్డుకోలేకపోయానని బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో ఇద్దరు నర్సులు కూడా అక్కడ ఉన్నారని, కానీ ఈ ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె పేర్కొంది.దీంతో ఈ నెల 14న సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, ఎనిమిది మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం  ఏర్పాటు చేశారు. సిట్ బృందం నిందితుడిని గుర్తించేందుకు ఆసుపత్రిలోని దాదాపు 800 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది. అలాగే ఆసుపత్రి సిబ్బందిని విచారించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో గత ఐదు నెలలుగా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బీహార్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన దీపక్ (25) సదరు మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు నిందితుడు దీపక్‌ను అరెస్టు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa