ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 ఏళ్లుగా భూమి వాడటం లేదా.. అయితే తిరిగి ఇచ్చేయాల్సిందే

national |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 08:42 PM

కొత్త రోడ్లు, అభివృద్ధి ప్రాజెక్టులు వస్తున్నాయంటే ఒకవైపు ఆనందం వెల్లివిరిస్తే, మరోవైపు తమ భూములను కోల్పోతున్న వారి గుండెల్లో ఆందోళన రేగుతుంది. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెబుతున్నా.. అది ఎప్పుడు అందుతుందో తెలియని అనిశ్చితి వారిని వెంటాడుతుంది. అంతేకాకుండా.. సేకరించిన భూమిని వెంటనే ప్రాజెక్టుల కోసం ఉపయోగించకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచడం అభివృద్ధి పనుల వేగాన్ని తగ్గిస్తోంది. ఈ పరిస్థితికి ఇకపై అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.


కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానం ప్రకారం.. జాతీయ రహదారుల నిర్మాణానికి భూమి సేకరిస్తే.. ఆ పనులను తప్పనిసరిగా ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే.. యజమానుల నుండి సేకరించిన భూమిని తిరిగి వారికి ఇవ్వాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. అంతే కాకుండా.. ప్రాజెక్టుల కోసం భూమిని అప్పగించిన యజమానులకు పరిహారం మంజూరైన మూడు నెలల తర్వాత ఆ భూమిపై వారి హక్కులు తొలగిపోతాయి. ఈ విధానానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైంది. దీనిని చట్ట రూపంలోకి తీసుకొచ్చి అమలు చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.


ఈ కొత్త విధానం కేవలం జాతీయ రహదారులకే పరిమితం కాదు. పౌర విమానయానం, రైల్వేలు, రక్షణ, షిప్పింగ్, బొగ్గు, పర్యావరణం వంటి ఇతర కీలక మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. అభివృద్ధి పేరుతో భూమి సేకరించి ఏళ్ల తరబడి రోడ్లు నిర్మించకుండా ఖాళీగా ఉంచడం ఇకపై జరగదు. అభివృద్ధి కోసం సేకరించిన భూములు నిరుపయోగంగా మారకుండా చూడాలనేది కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.


మరోవైపు.. కొన్ని రహదారుల పనులు నత్తనడకన సాగుతుండటం, కొన్ని చోట్ల అవసరానికి మించి భూసేకరణ చేపడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా.. భూసేకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ విధానం అమలులోకి వస్తే భూములు కోల్పోయిన వారికి ఒక నిర్దిష్ట కాలపరిమితిలో న్యాయం జరుగుతుంది.


ఈ కొత్త విధానం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించనుంది. ఈ వెబ్‌సైట్‌లో భూములు ఇచ్చిన యజమానుల వివరాలు.. వారికి మంజూరైన పరిహారం.. సేకరించిన భూమి విస్తీర్ణం వంటి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే.. రహదారుల నిర్మాణం వేగవంతం కావడంతో పాటు భూసేకరణ.. పరిహారం చెల్లింపు విషయంలో కూడా ఒక స్పష్టమైన విధానం అమల్లోకి వస్తుంది. ఇది భూములు కోల్పోయిన వారికి.. అభివృద్ధి పనులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa