ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 12:52 PM

ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టు... ఆమె కుటుంబ సభ్యులకు వేధింపులు, బెదిరింపుల కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్సార్‌ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌ అధికారులు పీఎస్సార్‌, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీలపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటుపడింది. కాంతి రాణా, విశాల్‌ గున్నీ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందారు. ఈ కేసులో ఏ2గా ఉన్న పీఎస్సార్‌ మాత్రం, ‘డీజీ స్థాయిలో ఉన్న నన్ను ఎవరూ టచ్‌ చేయలేరు’ అన్నట్లుగా ధీమాగా ఉండిపోయారు. కానీ... సీఐడీ అధికారులు అనూహ్యంగా ఝలక్‌ ఇచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ మండలం అమడాపూర్‌లో ఐదేళ్ల కిందట పీఎస్సార్‌ ఆంజనేయులు 2.20 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులోనే ఫామ్‌హౌస్‌ నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు. పీఎస్సార్‌ కోసం సోమవారం సాయంత్రమే సీఐడీ బృందాలు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లాయి. అయితే... పోలీసులు చేరుకునే సమయానికి ఆయన ఫామ్‌హౌ్‌సలో లేరు. హైదరాబాద్‌ నగరంలోని కుందన్‌బాగ్‌లో ఉన్న వియ్యంకుడి ఇంటికి చేరుకున్నారు. దీంతో సీఐడీ అధికారులు మంగళవారం ఉదయం అక్కడికే వెళ్లి పీఎస్సార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడి నుంచి మొయినాబాద్‌ ఫార్మ్‌ హౌస్‌కు తీసుకెళ్లి... సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పీఎస్సార్‌ను అరెస్టు చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి... మధ్యాహ్నానికి విజయవాడ కానూరులో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి విచారించారు. ఆయనకు బుధవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి... కోర్టులో హాజరు పరచనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa