విజయవాడ రైల్వేస్టేషన్లో మంగళవారం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీస్ జాగిలం లియోను అందరూ అభినందిస్తున్నారు. రైల్వే డీఐజీ ఆదేశాలతో రైల్వే పోలీసులు విజయవాడ రైల్వేస్టేషన్లో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లియో డాగ్ ఓ బ్యాగ్ వద్ద ఆగిపోయింది. క్లోక్ రూమ్లోని బ్యాగ్ వద్ద లియో డాగ్ ఆగిపోవటంతో రైల్వే పోలీసులు ఏముందా అని చెక్ చేశారు. అందులో ఉన్నది చూసి షాక్ తిన్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తేదీ ఏప్రిల్ 22, 2025 మంగళవారం.. ప్రదేశం విజయవాడ రైల్వేస్టేషన్.. వచ్చీ పోయే ప్రయాణికులతో రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. ఈ ఉరుకుల పరుగుల గజిబిజి జీవితంలో ఎవరి దారి వారిదే, ఎవరి పయనం వారిదే. రైళ్లు వస్తున్నాయి, పోతున్నాయి.. ప్రయాణికులు రైళ్లు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. అంతలో హఠాత్తుగా కలకలం.. పోలీస్ జాగిలం లియోతో రైల్వేస్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. లియో డాగ్ సాయంతో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తూ వస్తున్నారు. ఇంతలో ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ మీద ప్రయాణికులు సామాన్లు భద్రపరచుకునే క్లోక్ రూమ్ వచ్చింది. అప్పటి వరకూ గబ గబా పరుగులు తీసిన లియో, అక్కడకు రాగానే ఎర్ర జెండా చూసిన రైలులా ఠపీమని ఆగిపోయింది. లియో వెంట వచ్చిన రైల్వే పోలీసులతో పాటుగా.. ప్లాట్ ఫామ్ మీద ఉన్న రైలు ప్రయాణికుల్లోనూ ఒకటే ఉత్కంఠ.. లియో ఎందుకాగింది?
క్లోక్ రూమ్లో బ్యాగుల తనిఖీ.. నివ్వెరపోయిన పోలీసులు, ఆ బ్యాగులో ఏముంది?
క్లోక్ రూమ్ ముందు ఆగిన లియో.. నెమ్మదిగా ఆ రూమ్లోకి ప్రవేశించింది. ఒక్కొక్క బ్యాగును వాసన చూస్తూ పసిగడుతూ వచ్చిన లియో.. ఒక్క బ్యాగ్ వద్ద ఆగిపోయింది. ఆ అనుమానిత బ్యాగ్ వద్ద నుంచి లియో పక్కకు జరగలేదు. దీంతో రైల్వే పోలీసుల అనుమానం బలపడింది. ఆ అనుమానిత బ్యాగులో ఏముందనే ఉత్కంఠ పెరిగింది. అలాగే ఆ బ్యాగ్ ఎవరిదనే దానిపైనా పోలీసులు దృష్టిపెట్టారు. గుమాస్తాను పిలిపించి.. క్లోక్ రూమ్లో కనిపించిన అనుమానిత బ్యాగ్ గురించి వివరాలు అడిగారు. అయితే ఆ బ్యాగ్ ఎవరిదో తమకు తెలియదని.. ఏప్రిల్ పదో తేదీ నుంచి ఆ బ్యాగ్ క్లోక్ రూమ్లో ఉన్నట్లు రైల్వే సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది.
అనుమానిత బ్యాగ్ను ఓపెన్ చేస్తే..
లియో డాగ్ పసిగట్టిన బ్యాగ్ను రైల్వే పోలీసులు తెరిచి చూసి షాక్ తిన్నారు. అందులో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. అలాగే బంగారం, వెండి నగలు దర్శనమివ్వటంతో పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది. నగదు ఎంత ఉందా అని లెక్కించి చూస్తే రూ.9.70 లక్షలుగా లెక్క తేలింది. అయితే బ్యాగులో ఇతరత్రా వివరాలేవీ కనిపించనట్లు తెలిసింది. భారీగా డబ్బు, నగలు ఉండటం, పదిరోజులుగా రైల్వేస్టేషన్లోనే బ్యాగ్ ఉండటంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
ఆ బ్యాగ్ ఎవరిది, ఆ నగదు, బంగారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. స్మగ్లర్ల పనా అనుకుంటే పది రోజుల పాటు అక్కడే ఉండదుగా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు విజయవాడ రైల్వే పోలీసులు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa