మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదంటారు. మానవ మెదడే అతి పెద్ద అద్భుతం.. మరి దానికి కాస్త పదును పెడితే.. అది సృష్టించే విజయాలు ఎన్నో. చరిత్ర సృష్టించాలంటే.. పెద్ద పెద్ద కాలేజీల్లో.. గొప్ప గొప్ప చదువులు చదవాల్సిన అవసరం లేదు. కాస్త బుర్రకు పదును పెడితే.. ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బైక్ మెకానిక్ కూడా ఇలానే ఆలోచించి.. అద్భుతం చేశాడు. చిన్న ఆలోచనతో లక్షల రూపాయల ఖర్చు చేయాల్సిన అవసరాన్ని అధిగమించాడు. ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎడ్లు కచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడైతే ట్రాక్టర్ తప్పనిసరి అయ్యింది. మరి చిన్న, సన్నకారు రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి ట్రాక్టర్ కొనాలంటే కష్టం. ఆ సమస్యను సదరు రైతు మెకానిక్ పరిష్కరించాడు.
ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలం, ఎడ్లూరిపాడుకు చెందిన హజ్రత్ వలి అనే బైక్ మెకానిక్ కాస్త వినూత్నంగా ఆలోచించి.. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్గా పనిచేసేలా మార్చి.. రైతులకు మేలు చేశాడు. వలి కనిపెట్టిన ఈ పరికరం ద్వారా.. రైతులు వ్యవసాయ పనులు చక్కబెట్టుకోవచ్చు. దీని తయారికి గాను వలికి అవసరమైన మొత్తం కేవలం 20 వేల రూపాయలు మాత్రమే.
బైక్ను ట్రాక్టర్గా మార్చాలని భావించిన వలి.. ముందుగా తన ద్విచక్ర వాహనం టైర్లను తొలగించి.. వాటి స్థానంలో బురదలో దిగబడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన బలమైన బటన్ చక్రాలను అమర్చాడు. దాని సామర్థ్యానికి అనుగుణంగా నాగలి, స్ప్రేయర్, విత్తనాలు వేసే పరికరంతో పాటుగా ట్రాలీని కూడా ఏర్పాటు చేశాడు. తమ అవసరానికి తగ్గట్టు రైతులు ఈ పరికరాలను సులభంగా అమర్చుకునేలా లాకింగ్ సిస్టమ్ని కూడా అభివృద్ధి చేశాడు.. దీని కోసం రూ. 20,000 ఖర్చు చేశానని వలి చెప్పుకొచ్చాడు. ఎవరైనా పాత బైక్ తీసుకువస్తే, వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తానని చెబుతున్నాడు వలి. సాధారణ బైక్ మెకానిక్ సాధించిన ఈ విజయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. రైతులకు ఎంతో మేలు చేశావని ప్రతి ఒక్కరు అతడిని ప్రశంసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa