భారతీయ స్టాక్ మార్కెట్ నేడు నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 80,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. గత ఏడు రోజులుగా కొనసాగుతున్న లాభాల పరంపరకు ఈ రోజుతో తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది.విదేశీ మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం వంటి సానుకూల అంశాలు నష్టాల తీవ్రతను కొంతమేర తగ్గించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 80 వేల మార్కును కోల్పోయింది.ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 80,058.43 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో మొదలైంది. రోజంతా ఒడిదుడుకులకు లోనైన సూచీ, ఒకానొక సమయంలో 79,724.55 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి, మునుపటి ముగింపుతో పోలిస్తే 315 పాయింట్ల నష్టంతో 79,801.43 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 82 పాయింట్లు నష్టపోయి 24,246 వద్ద ముగిసింది.ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ పుంజుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి 17 పైసలు లాభపడి 85.28 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా షేర్లు లాభాలను ఆర్జించి మార్కెట్కు కొంత ఊతమిచ్చాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa