పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత, భారత్ ఎలాంటి ప్రతీకార చర్య తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గతంలో ఉరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్ దృఢంగా స్పందించిన విషయం తెలిసిందే. అయినా కూడా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, భారత్తో సైనిక ఘర్షణకు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. పాకిస్థాన్లో నెలకొన్న తీవ్ర అంతర్గత సంక్షోభం, సైన్యం పట్ల తగ్గుతున్న ప్రజాదరణ నేపథ్యంలో మునీర్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉండగా, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో సాయుధ తిరుగుబాట్లు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయి. మరోవైపు, పాక్ సైన్యం, ముఖ్యంగా జనరల్ మునీర్ ప్రజాదరణ గణనీయంగా క్షీణించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, దేశాన్ని ఏకం చేయడానికి, సైన్యంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడానికి భారత్తో ఒక పరిమిత స్థాయి యుద్ధం ఉపకరిస్తుందని మునీర్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. "పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉద్రిక్తతలను పెంచి, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు" అని జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ అన్నారు.దాడికి కొద్ది రోజుల ముందు, ఏప్రిల్ 16న జనరల్ మునీర్ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. "మన మతం, సంప్రదాయాలు హిందువుల కన్నా భిన్నమైనవి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత పహల్గామ్లో జరిగిన దాడిలో మతం ఆధారంగా పర్యాటకులను లక్ష్యం చేసుకోవడం యాదృచ్ఛికం కాదని పలువురు భావిస్తున్నారు. ఇది భారత్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించి, ప్రతిచర్యకు పురిగొల్పే వ్యూహంలో భాగం కావచ్చని అంచనా వేస్తున్నారు.పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సైన్యం ప్రస్తుతం ప్రజా మద్దతును కోల్పోతోందని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో, భారత్ నుంచి ఏదైనా సైనిక చర్య జరిగితే, అది పాకిస్థానీయులలో జాతీయతా భావాన్ని రగిలించి, విభేదాలను పక్కనపెట్టి సైన్యానికి మద్దతుగా నిలిచేలా చేస్తుందని మునీర్ భావిస్తూ ఉండవచ్చు. మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ వంటి నేతలు సైతం, "భారత్ దాడి చేస్తే రాజకీయ విభేదాలు పక్కన పెట్టి దేశం కోసం ఏకమవుతాం" అని వ్యాఖ్యానించడం గమనార్హం.భారత్ ఇప్పటికే పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రవాదులను, వారి వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దౌత్యపరమైన చర్యలతో పాటు, సైనిక ప్రత్యామ్నాయాలను కూడా భారత్ పరిశీలిస్తోంది. అయితే, జనరల్ అసిమ్ మునీర్ తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ఈ సంక్షోభాన్ని వాడుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa