ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ రేంజర్లకు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 08:28 PM

ఓ వైపు భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కీలక సంఘటన ఒకటి జరిగింది. సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే ఓ బీఎస్ఎఫ్ జవాన్.. పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లాడు. అక్కడే పాక్ రేంజర్లకు చిక్కాడు. దీంతో ఆ బీఎస్ఎఫ్ జవాన్‌ను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ బీఎస్ఎఫ్ జవాన్‌‍ను విడిపించేందుకు.. భారత్-పాక్ అధికారులు చర్చలు జరుపుతున్నారు.


సాధారణంగా భారత్-పాక్ సరిహద్దుల్లో రెండు దేశాలకు చెందిన సైనికులు అనుక్షణం గస్తీ కాస్తూ ఉంటారు. కొన్నిసార్లు పొరపాటున సరిహద్దులు దాటి.. భారత జవాన్లు పాక్ భూభాగంలోకి వెళ్లడం.. పాక్ రేంజర్లు భారత భూభాగంలోకి రావడం సర్వసాధారణమే. అయితే అలాంటి సందర్భాల్లో రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపి.. ఎవరి సైనికులను వారి భూభాగంలోకి పంపిస్తూ ఉంటారు. ఇలాగే తాజాగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్.. పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి.. పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టాడు. అయితే అది గుర్తించిన పాక్ రేంజర్లు.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న.. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్.. స్థానికంగా రైతుల పంటకు భద్రతగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్టు నీడ కోసం కొద్దిగా ముందుకు వెళ్లాడు. అయితే అది సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అటు వైపు గస్తీ కాస్తున్న పాక్ రేంజర్లు కాస్తా.. పీకే సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సమాచారాన్ని పాక్ రేంజర్లు.. భారత సైన్యానికి అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు.


 బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్, పాక్ రేంజర్స్ మధ్య ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. పీకే సింగ్ పొరపాటున భారత భూభాగం నుంచి పాక్ భూభాగంలోకి అడుగు పెట్టాడని.. అతడ్ని వదిలేయాలని బీఎస్ఎఫ్ అధికారులు.. పాక్ రేంజర్లకు సూచించారు. అయితే పాక్ రేంజర్లు ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినపుడు.. అవి దౌత్యపరమైన లేదా సైనిక పరమైన చర్చల ద్వారా పరిష్కారం అయి.. వారిని వెనక్కి తీసుకువస్తూ ఉంటారు.


అయితే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌పై భారత్ పలు కఠిన చర్యలు తీసుకుంటోంది. అందుకు ప్రతీకారంగా పాక్ కూడా అలాంటి చర్యలే భారత్‌పైనా తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పీకే సింగ్.. పాక్ భూభాగంలో అడుగుపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పాక్ రేంజర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa