ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్రపు స్వారీకి ఎక్కువ ధరే.. ఆ 23 మంది కేరళ టూరిస్టులను కాపాడింది

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 08:34 PM

కేరళ నుంచి జమ్ము కశ్మీర్ వెళ్లిన 23 మంది పర్యాటకులు.. అక్కడి అన్ని ప్రాంతాలను చూడాలకున్నారు. అయితే బైసరన్ లోయకు వెళ్లేందుకు హార్స్ రైడింగ్ చేయాల్సి ఉండగా.. ఎక్కువ ధర చెప్పారు. దీంతో తాము అన్ని డబ్బులు పెట్టి అక్కడకు వెళ్లలేమని.. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అయితే అప్పుడు మనసులో బాధ పడుతూనే ఉన్నా.. కాసేపటికే అదే మంచి పని అయిందని భావించారు. దాని వల్లే తమ ప్రాణాలు దక్కాయని గుర్తించారు. ముఖ్యంగా మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి నుంచి వీరంతా క్షణాల్లో తప్పించుకున్నారు. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లిన కాసేపటికే ఈ కాల్పులు జరిగాయి. ఆపూర్తి వివరాలు మీకోసం.


జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో మంగళవారం రోజు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇంకొంత మంది ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ముఖ్యంగా కేరళ నుంచి కొన్ని కుటుంబాలు కలిసి జమ్ము కశ్మీర్‌లో పర్యటన కోసం వచ్చారు. ముఖ్యంగా ఈ గ్రూపులో 23 మంది ఉండగా.. మంగళవారం రోజే వీరంతా మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతానికి వెళ్లారు. అయితే టూరిస్ట్ స్పాట్‌కు వెళ్లాలంటే గుర్రంపైనే వెళ్లాల్సి ఉంటుంది.


దీంతో వారంతా గుర్రపు స్వారీ కోసం అక్కడి వారితో మాట్లాడారు. కానీ అందుకు ఎక్కువ ధర ఉండడం చూసి.. తామంత డబ్బు పెట్టలేమని వెనక్కి వచ్చారు. మనసులో ఇంత దూరం వచ్చాం, ఈ ప్రాంతం కూడా చూస్తే బాగుంటుందని భావించినా.. మరీ అంత డబ్బులు పెట్టడం అవసరం లేదనుకుంటూ.. ఓ ట్యాక్సీ మాట్లాడుకుని వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. వీరంతా ట్యాక్సీలో ఎక్కి కొంచెం దూరం వెళ్లగానే పెద్ద ఎత్తున కాల్పుల శబ్దాలు వినిపించాయి. అలాగే అనేక మంది దుకాణాలు మూసివేస్తూ.. రోడ్లపై పరుగులు పెట్టడాన్ని గుర్తించారు. కానీ వారందరికీ ఏం జరుగుతుందో అర్థం కాక ఓ మంచి ప్రాంతానికి తీసుకెళ్లమని గైడ్‌కు సూచించారు.


కానీ అతడు మాత్రం మీకు ప్రాణాలతో ఉండాలని లేదా అని ప్రశ్నించి.. ఏమీ మాట్లాడకుండానే నేరుగా వారందరినీ హోటల్‌కు తీసుకెళ్లి దింపేశాడు. అలా వారంతా తమ గదులకు వెళ్లిపోగానే టీవీలు, ఫోన్ల ద్వారా అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని తీవ్రంగా భయపడిపోయారు. గుర్రపు స్వారీ వద్దు అనుకోవడం వల్లే తమ ప్రాణాలు కాపాడుకోగలిగామని చెప్పుకొచ్చారు. అలాగే ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఒక్కరు కూడా లేరని.. అందుకే వారు ఆ ప్రాంతంపై దాడి చేసినట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa