ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ముగ్గురిలో ఎవరి ఆచూకీ చెప్పినా రూ.20 లక్షల రివార్డ్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 09:14 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. అయితే 28 మందిని కాల్చి చంపిన ముష్కరులు అనంతరం అడవుల్లోకి పారిపోగా.. వారిని పట్టుకునేందుకు అటు పోలీసులతో పాటు ఇటు భద్రతా బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండ్రోజులుగా లోయ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే ఈ దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన భారత బలగాలు.. వారిపై ఇప్పుడు రివార్డును కూడా ప్రకటించాయి. ముగ్గురిలో ఏ ఒక్కరి ఆచూకీ చెప్పినా రూ.20 లక్షలు ఇస్తామని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.


జమ్ము కశ్మీర్‌లోని బైసరన్ లోయలో ఉన్న పర్యటకులపై మంగళవారం రోజు ఉగ్రవాదులు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 28 మందిని చంపేసి ఆపై స్థానికంగా ఉన్న అడువుల్లోకి పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి టెర్రరిస్టులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా టెర్రరిస్టులను చూసిన పర్యటకులను తీసుకెళ్లి.. వారి సాయంతో ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కూడా గీయించారు.


బుధవారం రోజే పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను సైతం ఏజెన్సీలు విడుదల చేశాయి. మొత్తం ముగ్గురు ముష్కరులకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేశారు. వీరిలో ఇద్దరిని పాకిస్థాన్ పౌరులుగా గుర్తించారు. వీరందరికీ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని.. వీరి పేర్లు ఆదిల్ హుస్సనే థోకర్, అలీ భాయ్, హషీమ్ ముసాలు అని పేర్కొన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు కనిపించినా, వారిని గురించి తెలిసినా, ఎవరైనా వారు ఎక్కడ ఉన్నారనే దానిపై చర్చించుకుంటుండగా విన్నా వెంటనే తమకు తెలియజేయాలని అనంత్ నాగ్ పోలీసులు చెప్పారు. వీరిని బంధించడానికి లేదా మట్టుబెట్టడానికి, పట్టుకోవడానికి ఉపయోగపడే సమాచారం ఇవ్వాలని స్థానిక పౌరులకు సూచించారు.


ఇలా ఈ ముగ్గురు ముష్కరుల గురించి లేదా అందులో ఏ ఒక్కరికి చెందిన చిన్న విషయం చెప్పినా తమకు ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా ఈ టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఉపయోగపడే ఎలాంటి విషయం చెప్పినా వారికి రూ.20 లక్షల రివార్డు అందజేస్తామని కూడా ప్రకటించారు. అలాగే ఆచూకీ చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు మరోసారి ఆ ముగ్గురి ముష్కరుల ఫొటోలు, పేర్లను మరోసారి షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa